Showing posts with label తర్కం. Show all posts
Showing posts with label తర్కం. Show all posts

Friday, January 19, 2018

నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం PART3 రాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము


https://www.facebook.com/vallury.sarma/posts/506739959363422

https://www.facebook.com/vallury.sarma/posts/507131505990934

https://www.facebook.com/vallury.sarma/posts/507424952628256


మనం వాయువ్యంనుండి, పశ్చిమంనుండి ఇస్లాం మనదేశంలో అడుగుపెట్టినదని తెలుసుకున్నాము. మరి తూర్పున బెంగాల్ లోనికి ఎప్పుడు అడుగుబెట్టినది? నలందా, విక్రమశిలా విశ్వవిద్యాలయాలను ధ్వంసంచేసిన భక్తియార్ ఖిల్జీ ఎవరు? మహమ్మద్ ఘోరీ తరువాత అతడి బానిస, తరువాత అతని సేనాపతి, ఐన ఖుత్బుద్దీన్ ఐబక్ మొదటిసుల్తాన్ అయ్యాడు. అతడి వంశాన్ని ఘులాం (బానిస) వంశం అన్నారు. ఇతని సైన్యాధికారి భక్తియార్ ఖిల్జి. ఆఫ్గనిస్తాన్ లొ స్థిరపడిన ఒక తురుష్క (Turkish) తెగవారు ఖిల్జీలు. అయోధ్యనవాబు అతనిని సేనాపతి చేశాడు. బీహారు తరువాత అతని దృష్టి బెంగాల్ పై పడినది. మొదట నవద్వీపము, (ఇప్పటి నాడియా) తరువాత గౌర్ పట్టణాలను (ఇది గంగా తీరాన ఉన్న గౌడదేశ రాజధాని) అక్రమింఛాడు. (గౌడదేశము అంటే పశ్చిమ బెంగాల్, వంగదేశమంటే తూర్పు బెంగాల్). (గౌడీయ మఠము పేరు ప్రసిద్ధము.) హిందూ ధర్మపరంగా ఆకాలంలో మొదట బీహార్ లోని మిథిలను, తరువాత బెంగాల్ లోని నవద్వీపాన్ని చెప్పుకోవాలి. భారతీయ (హిందూ) న్యాయ, తర్కాలు, బౌద్ధ జైన తర్కాలను అధిగమించి నవ్యన్యాయము అనే కొత్త తర్కాన్ని ఆకాలంలోనే ప్రవేశ పెట్టాయి. మిథిలలో గంగేశ ఉపాధ్యాయుని ప్రమాణతత్త్వ చింతామణి దీనికి మూలగ్రంధం. తరువాత నవద్వీపములోని రఘునాథ శిరోమణి విఖ్యాతుడు. చైతన్య మహాప్రభు మొదట తర్కాన్ని నవద్వీపంలోనే అభ్యసించాడు. ఇస్లాం పరంగా బెంగాలీలలో అధిక సంఖ్యాకులను ముస్లిములుగా మార్చిన ఘనత భక్తియార్ ఖిల్జీదే. అల్ మహ్మద్ అనే బంగ్లాదేశకవి 1990లలో "భక్తియారేర్ ఘోడే " (భక్తియార్ అశ్వాలు) అనే తన కావ్యంలో బంగభూమిపై ఇస్లాం విజయాన్ని కీర్తించాడు. 13వ శతాబ్దంలో ఈ సంఘటన 1905లో కర్జన్ చేత బెంగాల్ మొదటి విభజనకు, 1947లో తూర్పు పాకిస్తాన్ వేర్పాటుకు, 1971 లో బంగ్లా అనే మరొక ముస్లిం దేశపు జన్మకు కారణమైంది. చైతన్య మహాప్రభు(1486-1534) తన కృష్ణభక్తి మార్గంతో బెంగాల్లో ఇస్లాం ఉప్పెనను కొంత వరకు ఎదుర్కొన్నాడు. వాయువ్య దిశన అరబిక్, పారశీక భాషలూ, ఇక్కడ పుట్టిన ఉర్దూ కలసి ఏర్పడిన మిశ్రమ భాష వాయువ్య రాష్ట్రాలనుండి బీహార్ వరకు పనికి వచ్చింది. బెంగాల్ లో పనికిరాలేదు. మతం మీద మమకారం తూర్పు పాకిస్తాన్ గా రూపు దిద్దుకుంటే, భాష పై మమకారం బంగ్లాదేశాన్ని సృష్టించింది.
ఈ చరిత్ర ఎందుకు చదవాలి? ఆనాటి బెంగాల్ లో ఇస్లాం ప్రచారంకావడానికి, నేటి అంధ్రలో క్రైస్తవానికి ప్రచారం రావడానికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఆనాటి భక్తియార్ అశ్వాలు, నేటి అమెరికా డాలర్లుగా మారిఉండవచ్చును. మతం, పౌరసత్వం, సంస్కృతి, భాష ఇవన్నీ జేబులో పెట్టుకునే ఆధారప్రమాణాలు (ID Cards) కావు. ఈ దినం భక్తితో పూజించిన విగ్రహాలను మరునాడు పనికి మాలినవి గా నిర్ణయించుకోవడం, తిరుపతిలో పవిత్రతను మక్కాకో, బెథెల్ హాంకో మార్చుకోవడం వెనుక కొంత ఘర్షణ ఉంటుంది. అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే. చిన్నప్పుడు చదివిన "చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ" గుర్తుకు తెచ్చుకుంటూ, మనుమరాలో. మనుమడో చదువుతున్న " Solomon Grundy, Born on a Monday, Christened on Tuesday,.. Buried on a Sunday" విని ఆనందిస్తున్నట్లు నటించడం కష్టమే.

Nandiraju Radhakrishna "అమెరికా పౌరసత్వం తీసికొని, అమెరికా వెళ్ళడానికి పనికివచ్చిన భారత పాస్ పోర్ట్ ని జ్ఞాపిక గా చేసుకోవడం అలాంటిదే.....ఈ చరిత్ర ఎందుకు చదవాలి?" అద్భుతంగా చెప్పారు. అసలు ఇవి చదివేందుకు ఎంతమందికి ఆసక్తి ఉంది సార్? ఆసక్తి వున్నా అసలు తెలిసిన వాళ్లేరీ చెప్పేవాళ్లేరీ? ధన్యులం.P Mallikarjuna Rao Well said Sarma garu. Many are converting for the sops they offer and a few show caste as a reason for this conversion. This lot is more dangerous than the former. Further, as Gurugi said on some occasion, the muslims targeted the body while the Christians, the soul. Hence establishment of schools and hospitals.


మన నాటి, నేటి చరిత్రల పునశ్చరణలో "సృష్టి" వలెనే, చరిత్ర కూడా పునరావృత్తం అవుతుందని తెలుసుకున్నాం. అది గమనించకపోతే కలిగే నష్టాలను, నేటి పరిస్థితులనూ పోలుస్తూ ముందుకు సాగుతున్నాము. ఢిల్లీ సుల్తానులవద్ద ఢిల్లీని వదలి దక్షిణ భారతానికి వద్దాం. మన చరిత్ర పుస్తకాలు పట్టించుకోని భాగాలలో ఇది ఒకటి. ఇంత కంటే అన్యాయం, ఈశాన్య భారతం చరిత్ర. సిక్కిం, అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం గురించి సగటు భారతీయునికి ఏమీ తెలియదు అనే చెప్పాలి. కాశ్మీర్ వివాదం గురించి, కార్గిల్ యుద్ధంగురించి తెలియవచ్చును గాని సనాతన ధర్మంలో కాశ్మీరుకు ఉన్న స్థానం గురించి తెలియక పోవచ్చును.కాని జమ్మూ సమీపంలోని వైష్ణోదేవి ఆలయం ప్రసిద్ధము.ఇంకా కొందరు అమర్ నాథ్ గుహలోని మంచులింగమును కూడా చూసి ఉండవచ్చును.
దక్షిణభారత చరిత్రలో సనాతనధర్మ పరంగా గుర్తుంచుకోవలసిన మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యుడు. బౌద్ధ, జైనాలు వ్యాపించిన దక్షిణభారతంలో సనాతన ధర్మాన్ని పున: ప్రతిష్ఠించిన వ్యక్తి. బుద్ధుడు "దు:ఖానికి కారణం కోరికలు" అంటే కోరికలకు కారణమేమని ప్రశ్నించాడు. "విశ్వం పశ్యతి కార్య కారణతయా .." అని వర్ణిస్తూ కోరికలకు కూడా కారణం ఉంటుందనిచెప్పారు (అవి జన్మతః సంక్రమించిన సంస్కారాలు). మళ్ళీ ప్రపంచాన్ని "విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం" అని వ్యావహారిక సత్యంగా గోచరించే జగత్తును గురించి చెప్పారు. "అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం" అని నమస్కరిస్తూ గీతకు , ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యాలు వ్రాశారు.భజగోవిందం భజగోవిందం గోవిందమ్ భజ మూఢమతే అంటూ నారాయణ నామ స్మరణనూ, కృష్ణ పరమాత్మకు శరణాగతిని బోధించారు. నేటి కేరళలో పెరియార్ (పూర్ణా) నదీ తీరాన కొచ్చి, ఆల్వేయి సమీపంలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఈ ద్రావిడ శిశువు 32 సం. జీవితకాలం లోపలనే కాశ్మీరు, నేపాలు తో సహా భారతదేశమంతా కాలినడకన తిరిగి ద్వారక, శృంగేరి, జ్యోతిర్మఠ్, పురీలలో అద్వైతబోధకు శంకరమఠాలను స్థాపించి కృష్ణుని తరువాత తిరిగి జగద్గురువైనారు. కేవలం తర్క, వాద పటిమ వలననే వారు జైనులనూ, బౌద్ధులను, మీమాంసికులను ఓడించగలిగారు. ఈయన బోధించిన అద్వైతానికి మూలం ఈయన పరమ గురువు గౌడపాదాచార్యుని మాండూక్యకారికలు. నర్మద సమీపంలో తన గురువైన గోవిందపాదుని కలుసుకొని ఆయన వద్ద మాండుక్య కారికలు గ్రహించారు. కాశ్మీరు శ్రీనగరంలో దాల్ సరస్సుకు ఎదుట గల శంకారాఛార్య గిరి పై మొదటి శివాలయాన్ని నిర్మించారు. (1987లో నాకు దర్శించే అదృష్టం కలిగినది)
మన భారత దేశంలోని నేటి పరిస్థితుల మూలాలు శతాబ్దాల, లేదా సహస్రాబ్దాల క్రితం జరిగిన సంఘటనలపై అధారపడి ఉండవచ్చు. 1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును. 20 వ శతాబ్దపు నూతన సమస్యలు, 1947 భారత దేశ విభజన, 1956 భాషా రాష్ట్రాలు, 1962 చైనాయుద్ధం తెచ్చిన నూతన సమస్యలు, 1971 పాకిస్తాన్ విభజన, నానాటికీ పెరిగి దేశానికి నూతన గుర్తింపు తెస్తున్న అవినీతి ప్రకరణం, "గరీబీ హటావో" లాంటి ఎన్నికల ప్రచార మంత్రాలతో పారిపోని బీదరికం, భారతీయతను విస్మరిస్తున్న మధ్య తరగతి ప్రజానీకం, దేశాన్ని దోచుకుంటున్న నేతలు .. ఇవన్నిటి మధ్య అదనంగా సృష్టించుకొని రాష్ట్రాన్ని వెనుకకు నడిపిస్తున్న రాష్ట్రవిభజన వంటి హాస్యాస్పద ఉద్యమాలు - మన దేశం ఏ సమస్యనూ పరిష్కరించుకోలేదన్న సత్యాన్ని పదేపదే ఋజువుచేస్తాయి. ఒక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రముగా చేయడానికి యజ్ఞాలు, హోమాలు చేయడం, నాయకులు కాని సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలూ మన ధర్మచ్యుతిని చెప్పకనే చెబుతున్నాయి. మత మార్పిడులు మతాన్నీ దేవుణ్ణీ అంగట్లో సరుకులు గా మారుస్తున్నాయి.

Nandiraju Radhakrishna "1950 లో We, the people of India వ్రాసుకున్న రాజ్యాంగం, దాని ఆధారంగా ఏర్పడిన ప్రభుత్వాలు, మన అసలు సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోను విఫలమయ్యాయని చెప్పవచ్చును."---- మన అసలు సమస్యలను నేలమాళిగలొ పూడ్చిపెట్టి వాటిని అవసరమైనప్పుడు పైకితెచ్చి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంలో ప్రభుత్వాలన్నీ విజయవంతమయ్యాయి. సంబంధం లేని అంశాలతొ ముడిపెట్టి సామాన్యులు, బీద బిక్కి ఆత్మహత్యలు చేసుకున్నారని అసత్య ప్రచారం చేసి ప్రజలను కనికట్టు చేయడంలో ప్రసార సాధనాలు తమకు తాము తాకట్టు పెట్టుకుని వందిమాగద బృందాలై డబ్బుకులోకం దాసోహమంటున్నాయిరాజరాజ నరేంద్రుడు - నన్నయ - ఆంధ్రమహాభారతము 
మన చరిత్ర పుస్తకాలలో లో రాజరాజ నరేంద్రుని పేరు కనిపించదు. ఉత్తరభారతంలో ఘజనీ మహమ్మదు 17 పర్యాయములు దండెత్తి ముఖ్యదేవాలయాలు విధ్వంసం చేసే సమయంలో దక్షిణభారతంలో సనాతన ధర్మ ప్రతిష్ఠాపన జరుగుతూంది. ఆది శంకరుల అడుగుజాడలలో, దేశభాషలకు ప్రచారమిచ్చిన బౌద్ధ జైనాలకు దీటుగా, సనాతన ధర్మ గ్రంధాలను దేశభాషలలోనికి తీసుకొని రావలసిన అవసరం వచ్చింది.వేంగి దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు, రాజరాజ నరేంద్రునిచేత (సా.శ.1019–1061) ఆ కార్యక్రమం ప్రారంభింపబడినది. రాజమండ్రి అనే రాజమహేంద్రవరాన్ని స్థాపించి, పాలించినవాడాయన. తన మంత్రి, గురువు ఐన నన్నయ భట్టారకుని పిలిచి లక్ష శ్లోకాల సంస్కృతభారతమును తెనిగించమని కోరాడు. నన్నయ జన్మస్థలం తణుకు అని చెబుతారు. ఆయన భారతాంధ్రీకరణం మొదలుపెట్టి తన జీవిత కాలంలో ఆది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో కొంత భాగాన్ని అనువదింఛాడు.
1. కావ్యారంభం
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
లక్ష్మీ దేవిని వక్షస్థలాన ధరించిన విష్ణువూ, సరస్వతిని ముఖమున ధరించిన బ్రహ్మ, పార్వతిని తన అర్ధ భాగంగా కలిగిన మహేశ్వరుడు - ఈ త్రిమూర్తులూ లోకాలను రక్షించేవారు. అవిహితమైన స్త్రీ, పురుష యోగోద్భవమైన లోకముల స్థితి వారు కలిగించుచున్నారు. వేదస్వరూపులు, దేవతాపూజ్యులు, పురుషోత్తములు, అట్టి ముమ్మూర్తులు మీకు శ్రేయస్సు కలుగజేతురు గాక. -- మహాభారతాంధ్రీకరణలో మొదటిగా నన్నయ చెప్పిన సంస్కృత శ్లోకం ఇది. తెలుగు సాహిత్యానికి శ్రీకారం.
2. మహా భారత ప్రాశస్త్యం
ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబని | యధ్యాత్మవిదులు వేదాంతమనియు
నీతివిచక్షుణుల్ నీతి శాస్త్రంబని | కవివృషభుల్ మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని | యైతిహాసికులితిహాసమనియు
బరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ| యంబని మహా గొనియాడుచుండ
వివిధవేద తత్త్వవేది వేదవ్యాసు | డాదిముని పరాశరాత్మజుండు
విశ్వసన్నిభుండు విశ్వజనీనమై | పరగుచుండ జేసె భారతంబు
3. సభలో ఎలా మాట్లాడాలి?
మనమునకుఁ బ్రియంబును హిత
మును బథ్యముఁ దథ్యమును నమోఘము మధురం
బును బరిమితమును నగు పలు
కొనరఁగ బలుకునది ధర్మయుతముగ సభలన్
తెలుగు మహాభారతం ఆంధ్రదేశమంతా బహుళ ప్రచారం పొందినది. "వింటే భారతం వినాలి" అనిపించింది. నేటి వరకు దీనిని మించినదిలేదు. గత వేయి సంవత్సరాలలో అభివృద్ధిచెందిన తెలుగు భాషకు, దానికి కారణమైన ఆంధ్రమహాభారత గ్రంధానికీ నిరాదరణ వస్తుందా? అనే అనుమానం 21వ శతాబ్దపు భారతదేశ లక్షణం. ఇప్పుడు 25-45 సం. వయస్సులోనివారు ఎందరికి కవిత్రయం భారతంతో పరిచయంఉంది? ఈ ప్రశ్నకు సమాధానం, నన్నయగారి శిలా ప్రతిమ కంటే ముఖ్యం. 5000 ఏళ్ళనాటి మహాభారతగాధను తెలుగు భారతం సామాన్యులకు అందించింది. దేశమంతా రామాయణము ప్రసిద్ధము,లోకప్రియము. కేవలము ఆంధ్రులకు భారతం అత్యంత ప్రియమైన గ్రంధం. 21వ శతాబ్దంలో భారతాన్ని చదువుకుంటే, శ్రీకృష్ణుని పూజిస్తే, భారతీయ సంస్కృతిని, భారతదేశాన్ని రక్షించుకోగలము. మహాభారతానికి, భారతదేశానికి మధ్య ఉన్నది అవినాభావ సంబంధం.




నాటి మహాభారతం - నేటి అవినీతి భారతం అన్న శీర్షిక PART2








న్యాయం, తర్కం, వాదం
నేను నాటి మహాభారతం, నేటి అవినీతి భారతం మీదవ్రాస్తున్న విషయాలు న్యాయ, తర్క, హేతువాద దృష్టితో వ్రాస్తున్నాను. ఇంగ్లీష్ లో చెప్పాలంటే Logic based Reasoning or rational view. ఒక వాక్యము సత్య వాక్యమా? లేదా అది సత్యానికి యెంత దూరం? ఇది చూచుకొని వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. ఉదాహరణకు రెండు తెలుగు వాక్యాలు ఇస్తాను. ఇవి సత్యమోకాదో పరిశీలిద్దాము. దీనినుండి ఇంతకంటె సత్యానికి చేరువగా ఉండే పదాలతో కొత్త వాక్యములను వ్రాయడానికి ప్రయత్నిద్దాము. 1. భీమరావు అంబేద్కరు దళిత వర్ణస్తుడు. 2. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు. నా దృష్టిలో ఈ రెండు వాక్యాలూ పూర్తి అసత్యాలు. మరి ఐతే వీటిని సత్యవాక్యాలుగా ఎలా వ్రాయవచ్చును? రేపు చూదాం.

నిన్న న్యాయము, తర్కము, వాదము అనే పదాలను గురించి చెబుతూ ఈవాక్యముల సత్యాసత్యములు గమనించమని అన్నాను.
1. భీమరావు అంబేద్కరు దళిత వర్ణస్తుడు.
2. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు.
మొదటి వాక్యము అసత్యము. ఎందుకంటే మన వర్ణవ్యవస్థలో దళితవర్ణము అనేది లేదు. పోనీ భీమరావు అంబేద్కరు దళితుడు అందామా అంటే అదీ అసత్యమే.ఆయన జీవితకాలంలో ఆ పదమే వాడుకలో లేదు.ఆయన బ్రతికి ఉంటే ఆపదాన్ని ఎప్పటికీ ఒప్పుకుని ఉండేవారు కాదు. భీమరావు అంబేద్కరు హరిజనుడు అన్నదికూడా అసత్యమే. అసలు గాంధీగారితో ఆయనకు విభేదం వచ్చినది ఆ పదం మీదనే. "అగ్రవర్ణాలవారు హరిజనులు కారా? వారు రాక్షస జనులా?" అది వారి ప్రశ్న. మాపై జాలితో అలాంటి పదాలు సృష్టించవద్దని వారి వాదం. ఆయన తనని తాను ఎలా వర్ణించుకొని ఉండేవారు. భీమరావు అంబేద్కరు శూద్రుడు అంటే ఆయన ఒప్పుకొనేవారు. ఆవర్ణంలోని ఉపకులం మహార్ ఆయన కులం.ఆయన "Who were the Shudras? - How they came to be the Fourth Varna in the Indo-Aryan Society" "శూద్రులు ఎవరు? ఎందుకు వారు భారతీయ ఆర్యసమాజములో నాలుగవ వర్ణముగా ఎందుకు పరిగణింపబడ్డారు?" అనే తన 1946లో ప్రచురింపబడిన పుస్తకములో తన కులమైన మహర్లు పూర్వము బౌద్ధులనీ, ఆమతమును వదలుకొనుటకు ఇష్టములేక హిందూ సమాజమునకు విడిగా జీవించారనే వాదనను ప్రతిపాదించారు.
దళిత పదం జయదేవ కవి దశావతార వర్ణనలోవాడిన పదం.
తవ కరకమల కరే నఖమద్భుత శృంగం | దళిత హిరణ్యకశిపు తను భృంగం
కేశవ ధృతనరహరి రూప జయ జగదీశహరే
రెండవ వాక్యము అసత్యము. దాని వ్యతిరేక వాక్యము కూడా అసత్యమే. నేటి భారతదేశ మహారాణి శ్వేతజాతీయురాలు కాదు. ఈ వాక్యము కూడా అసత్యమే. ఎందుకంటే నేటి భారత మహారాణి అన్నది శశ విషాణం (కుందేటి కొమ్ము), వంధ్యా పుత్రుడు, గగన కుసుమం వంటిదే. కాని సాహిత్యములో రూపకాలంకారంగా భావిస్తే ఆవాక్యము చెప్పే సత్యం భావనలోకి వస్తుంది.

క్రైస్తవ మత ప్రచారకుల వ్యూహమే వేరు. ఒకనాడు అస్పృశ్యతను చూపించి హరిజనులను, క్రీస్తు జనులుగా మార్చారు. ఇప్పుడు ఎప్పుడూ దళితులలోనే అసమానత ఉన్నది. ఇప్పుడు మహానాడు, దండోరాలపేరుతో వచ్చిన విభజన కుల నామాల పేర్లతో ఉన్నది. దానినికూడా చర్చి ఉపయోగించుకున్నది. ఒక చర్చి ఒకవర్గాన్ని ప్రొటస్టెంటులుగా మారిస్తే, మరియొక చర్చి ఇంకొక కులాన్ని కాథలిక్కులుగా మార్చింది. ఆ రెండు వర్గాల సమస్య వెనుక ఆరెండు చర్చిల సహకారం ఉంటుంది. మతమార్పిడితో హరిజన నామము నిరర్థకమైనది. శాశ్వత అసంతృప్తి, ఒక రకమైన, న్యూనతాభావం కారణంగా దళితనామము స్వీకరించారు. మత మార్పిడి కులాలను లేక సామాజిక వర్గాలను అధిగమించలేదనే పేరుతో దళిత క్రైస్తవులు, అన్య కులాల పేర్లతో కమ్మ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు అనే వర్గాలను సృష్టించారు. ఇది ఒక ఆధునిక మహాభారత యుద్ధమే (Crusade, is how they describe) ఒక వర్గానికి ధన బలం, అంగ బలము ఉన్నాయి. రెండవ వర్గానికి యుద్ధం జరుగుతున్న స్పృహకూడా లేదు. వ్యక్తులకు స్పృహ ఉన్నా సంస్థాగతమైన వ్యవస్థ లేదు.
అంబేద్కరు హిందూమతానికి, సనాతన ధర్మానికి, సమాజంలోని దురాచారాలకూ మధ్యగల భేదాన్ని అధ్యయనం చేయలేదు. కేవలం తన అనుభవాల దృష్ట్యా హిందూమతాన్ని వదిలేయాలని నిశ్చయించుకొని ఇతరమతాలను లోతుగా అధ్యయనం చేశాడు. అందుచేత బుద్ధుని తర్కమును, శంకరుడు జయించాడన్న విషయాన్ని ఆయన పరిగణనలోకి తీసుకో లేదు. కాని దీనికి ఆయనను తప్పు పట్టలేము.

భారతచరిత్రలో అనాదినుండీ జరుగుతున్నవి విదేశీ దండయాత్రలు. అలెక్సాండర్, ఇతర గ్రీకులు, శ్వేతహూణులు, యవనులు, ఇలా అందరోవచ్చి వాయువ్యభాగాన్ని వశం చేసుకుంటూనే ఉన్నారు. అప్పటికి అబ్రహాం (ఇబ్రహీం) మతాలు పుట్టలేదు. మన దేశాన్ని పాలించిన వారిలో ధర్మ పరంగా మెనాండర్-1, కనిష్కులను గుర్తుంచుకోవచ్చును. వారిద్దరూ బౌద్ధులుగా మారి వాయువ్యభాగంలో గాంధారం వరకు బౌద్ధాన్ని భద్రపరిచారు. మెనాండర్ ని మనవాళ్ళు మిళిందుడు అని పిలిచేవారు. అతని రాజధాని సకల (నేటి సయాల్ కోట్, పాకిస్తాన్) ఆయనతో బౌద్ధ సన్యాసి నాగసేనుడు చేసిన చర్చలు మిళిందపన్హా (పాళీ, మిళింద ప్రశ్న) అనే బౌద్ధగ్రంధంగా రూపు దిద్దుకున్నాయి. ఎంతోకాలం చర్చించాకే మిళిందుడు బౌద్ధం స్వీకరించాడు. రెండువేల ఏళ్ళనాటి విధానాలు చూస్తే మనం ఈరోజు ఎక్కడ ఉన్నామా? అనిపిస్తుంది. ఒక ఉదాహరణ:-- మిళిందుడు - ఆచార్యవర్యా, నాకు తమతో చర్చించాలని ఉన్నది. నాగసేనుడు- ఆర్యా, మహారాజా - చాలా సంతోషం. తమరు నాతో మహారాజుగా చర్చిస్తారా? లేక మనము ఇద్దరమూ సత్యాన్వేషకులుగా చర్చిద్దామా? మిళిందుడు - ఏమిటి మీ సందేహం? తేడా ఏమిటి? నాగసేనుడు - తమరు మహారాజుగా చర్చిస్తానంటే నాకు చాలా తేలిక . తమరు ఒక ప్రతిపాదన చేస్తే, నేను అది చాల అద్భుతంగా ఉంది అంటాను. అప్పుడు చర్చ ముగుస్తుంది. తమరు చెప్పినది వ్యతిరేకిస్తే ఏమౌతుందో నాకు తెలుసు.మీరు ఉన్నతమైన సింహాసనం మీద, నేను ఇక్కడ క్రింద కూర్చుని సభలో చర్చిస్తే సత్యము కనుపించదు. మనము ఇద్దరము విడిగా ఒక న్యాయవేత్త సమక్షములో పరస్పరము ఎదురుగ కూర్చుని వాదిస్తే సత్య నిరూపణ తేలిక ఔతుంది. దానికి మిళిందుడు అంగీకరిస్తాడు. వారి సంభాషణలే ఆగ్రంధం. అది రెండు వేలఏళ్ళనాటి రాజరికం.
నేటి పరిస్థితి. రాష్ట్రశాసన సభ ఎన్నికల అనంతరము సమావేశమైనది. అధిక సంఖ్యాకుల పార్టీ తమ నాయకుడిని ఎన్నుకోవాలి. విధానం అందరూ డిల్లీ వెళ్ళడం. అక్కడ పార్టీ అధిష్ఠానం (అంటే పార్టీ నియంత) ఎన్నుకోవలసిన ఒక వ్యక్తిని సూచించడం. అది నేటి ముఖ్యమంత్రి ఎన్నిక. దీని పేరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం.
తరువాత ప్రపంచ చరిత్రలో ముఖ్య ఘట్టం క్రైస్తవ మతం స్థాపన, తరువాత కొన్ని శతాబ్దాలకి ఇస్లాం ఆవిర్భావం. మనకు మొదట ముఖ్యంగా దండయాత్రలతో వచ్చినది ఇస్లాం. తరువాత వ్యాపారం ముసుగుతో వచ్చినది క్రైస్తవం. గత వేయి సంవత్సరాల భారత చరిత్రలో పరస్పర విరుద్ధమైన ఇస్లాం, క్రైస్తవ, హిందూ, జైన బౌద్ధ మతాల ప్రయాణమే, నేటి భారత, పాకిస్తాన్, బంగ్లా, నేపాల్, సింహళ దేశాల ప్రస్తుత చరిత్ర. ఈ నేపధ్యంలోనే శిఖ్ఖుమతం, భక్తి మార్గం, అద్వైతమాదిగా గల వేదాంత మతం పుట్టాయి.


మనదేశంలో ఆవిర్భవించకపోయినా వేయి సంవత్సరాలనుండి ఇస్లాం, 500 సంవత్సరాలనుండి క్రైస్తవమతం మన చరిత్రను ఎంతో ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి. దానిని అర్థంచేసుకోవాలంటే అవి ప్రపంచములో 60 శాతం జనంలో ఎలా వేళ్ళూనాయో తెలుసుకోవడం అవసరం. అవి ఒకే కుదుటిలోనివైనా ఆ రెండుమతాల మధ్య్యా బహుకాల సంఘర్షణ కూడా ఉన్నది. అది నేడు విశ్వవ్యాప్తమైన ఉగ్రవాదం మీద పోరులో కూడా అనుమానాలకు దారి తీస్తూంది. 20వ శతాబ్దంలోని దేశ విభజన, భాషా రాష్ట్రాల ఏర్పాటనే విఫల ప్రయోగం, త్రిభాషా సూత్రం అనే ప్రమాదకారి యైన విద్యారంగ నిర్ణయం, అనవసరంగా హిందీని రాష్ట్రభాషగా చేసిన రాజ్యాంగం, 21వ శతాబ్దంలో ఐలయ్యలాంటి వాళ్ళు కలలు కంటున్న హిందూమతానంతర భారత దేశ స్వప్నం, ఈ శతాబ్దములోనే తెలుగు మృతభాషగా మారిపోతుందన్న యునెస్కో అనుమానం, ప్రపంచీకరణ, ప్రపంచము ఒక కుగ్రామం (globaliation, concept of global village) అనే అసత్యాల, అర్ధ సత్యాల ప్రచారం, ఇలా ఎన్నో పరిణామాలు మన నేటి దుస్థితికి కారణం. ముహమ్మద్ ప్రవక్త (సా.శ. 570-632) జీవితకాలంలోనే ఇస్లాం అరేబియా అంతావ్యాపించింది. తరువాత 100-120 సం.లలో అట్లాంటిక్ తీరమైన స్పెయిన్ దేశంనుండి, మధ్యధరా తీర దేశాలు, మధ్య ఆశియా, భారతదేశంలో సింధు, పంజాబ్ వరకు మహమ్మదీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. (Arab or Islamic conquests).
ఆనాటి వాయువ్య భారతదేశంలోని ఖైబర్ కనుమ (khyber pass) భారత్ పై దండయాత్రలకు రాజమార్గం. అలెక్సాండర్, జెంఘిజ్ ఖాన్, ఘజనీ మహమ్మద్, ఘోరీ మహమ్మదు, బాబర్, తైమూర్, అందరిదీ ఇదే మార్గము. దీనిని కాపాడుకోవాలనే సామాన్య ఆలోచన కాని వ్యూహం కాని మన స్థానీయ రాజులు చేయలెదు. ఒకే ఒక సారి 1798లో మహారాజా రంజిత్ సింగ్ దీనిని వశపరచుకోగలిగాడు.కొన్నాళ్ళు అది భారతీయ సిఖ్ఖు రాజుల చేతికి వచ్చింది.
బోలన్ కనుమ (Bolan pass) బెలూచిస్తాన్, ఆఫ్గనిస్తాన్ సరిహద్దులలో ఉంది. క్వెట్టా నగరం నుండి శిబి,జాకొబాబాద్ అనే నగరాల మధ్య మార్గం లో ఉంటుంది. ఇది సింధు రాష్ట్రంపై అరేబియ దండయాత్రలకు మార్గం. శిబి నగరం పేరు ఆనాటి హిందూ చరిత్రను గుర్తుకు తెస్తుంది. 1960లలో అక్కడ 10 శాతం హిందువులుండేవారు. 2012లో వారి పరిస్థితులు దయనీయంగా ఉన్నట్లు వార్తలు వచ్చినా, వాటిని పట్టించుకునే నాథుడు లేడు.
ఈ రెండు మార్గాలు అరబ్, టర్కిష్ మొదలైన ఇస్లాం విజయాలకు మార్గాలైతే మూడో మార్గం అరేబియా సముద్రం. వీరు అరబ్ వ్యాపారులు. అరబ్ వ్యాపారులైనా, పోర్చుగీస్ వ్యాపారులైనా కూడా మతప్రచారకులుండే వారు. వీరి ప్రచార ప్రభావం ఎక్కువ కేరళ పై పడినది. కేరళలోని మలబార్ జిల్లా వీరికేంద్రం. వీరిని మాప్పిళ్ళ (Moplah) అంటారు. గాంధీగారి ఖిలాఫత్ ఉద్యమం భయంకర పరిణామాలు కేరళలో హిందువుల రక్తపాతానికి దారి తీశాయి. వ్యాపారం పేరుతో ఇండియాకు సముద్రమార్గం కనుగొనే ప్రయత్నంలోకూడా మతప్రచారం లక్ష్యం ఉన్నదనే సత్యాన్ని కొలంబస్ లేఖ నిరూపిస్తుంది. మధ్య ఆశియా భూమార్గం ముస్లిముల అధీనమయింది.
(From, The World is Flat , Thomas L Friedman) Letter of Columbus
Your Highnesses, as Catholic Christians, and princes who love and promote the holy
Christian faith, and are enemies of the doctrine of Mahomet, and of all idolatry and
heresy, determined to send me, Christopher Columbus, to the above-mentioned countries
of India, to see the said princes, people, and territories, and to learn their
disposition and the proper method of converting them to our holy faith; and
furthermore directed that I should not proceed by land to the East, as is customary,
but by a Westerly route, in which direction we have hitherto no certain evidence that
anyone has gone.
- Entry from the journal of Christopher Columbus on his voyage of 1492


ఘజనీ, ఘోరీ మహమ్మదుల దండయాత్రల తరువాత ఢిల్లీ అనేక ముస్లిం రాజవంశాల పాలనలో ఉన్నది. పరిపాలకుని ఢిల్లీ సుల్తాన్ అనేవారు (Delhi Sultanate). వీరి పరిపాలన 1206-1526 వరకూ ఉన్నది. ఘులాం, ఖిల్జీ, తుగ్లఖ్, సయ్యీద్, లోడీ వంశాలు. వీరుచేసిన ధర్మ విధ్వంసం మరపురానిది. మనం కొన్ని ముఖ్యమైన స్థలాలను మాత్రం గుర్తుకు తెచ్చుకుందాం. బౌద్ధుల విశ్వవిద్యాలయాలు - నలంద, విక్రమశిల. హిందువుల దేవాలయాలు, అసంఖ్యాకాలు. ఉదాహరణకు, సోమనాథ్, మథుర, కాశీవిశ్వనాథ్, మనకు సమీపంలో వరంగల్లు వేయిస్తంభాల ఆలయం. నలందా భారత దేశ ప్రాచీన విశ్వవిద్యాలయం. నలందా అంటే జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్ధం. గుప్తుల కాలంలోనే ఇది నిర్మింపబడింది. సుమారు సా.శ. 500నాటికే బహుళ ప్రచారం చెందినది. సుమారు 800 సంవత్సరాలు భారతీయ విజ్ఞానాన్ని, వేదాంతాలను ప్రపంచమంతా వ్యాపింపచేసినది. 1193లో నలందా విశ్వవిద్యాలయాన్ని, భక్తియార్ ఖిల్జీ నాయకత్వములో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశములో బౌద్ధం యొక్క క్షీణతకు మైలురాయి. 1235లో టిబెట్ అనువాదకుడు ఛాగ్ లోట్స్వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితము, ఖగోళశాస్త్రము, రసాయన శాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానము అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనము కారణమని చరిత్రకారులు భావిస్తారు. టిబెట్, చైనా, కొరియా, జపాన్, మంగోలియా, టర్కీ, ఆగ్నేయ ఆశియా,సింహళం వంటిదేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు. సా. శ. 1200 నాటికీ తూర్పున ఈ విద్యాలయాలు నశిస్తే, పశ్చిమాన ఇటలీ లోని బొలోనా, ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫర్డ్ అదే సమయంలో ప్రారంభమయ్యాయి. 2010లో అంతర్జాతీయ సహకారంతో నలందాలో, ప్రాచీన నలందా శిధిలాలకు 10 కి.మీ. దూరంలోని రాజగిరి (బీహార్) లో Nalanda University ని స్థాపించారు. ఇది మనదేశ ప్రస్తుత వాతావరణంలో ఏస్థాయికి వస్తుందో వేచిచూడాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండడం వలన ఆశలు నిజమయ్యే అవకాశం ఉన్నది. The Nalanda University 2010 act ప్రకారము దీని లక్ష్యం pursuit of intellectual, philosophical, historical and spiritual studies. మతం అన్నపేరే మనకు భయావహం.
నలందాతోబాటుగా విధ్వంసంచేయబడిన ఇంకొక బౌధ్ధవిద్యాలయం విక్రమశిల విద్యాలయం. ఇది భాగల్పూర్ సమీపములోనే ఉండేది. ఇదికూడా భక్తియార్ ఖిల్జీయే 1200లో నాశనంచేశాడు. ఇది సుమారు సా.శ. 800 ప్రాంతాలలో నిర్మింపబడింది. బెంగాల్ ను పరిపాలించిన పాల వంశము రాజులు దీనిని స్థాపింఛారు. వారు బౌద్ధులు. అదే సమయములో కామరూపను (అసోం) హిందువులైన పాలవంశపురాజులు పాలించారు. వారి పూర్వికుడుగా వారు నరకాసురుని చెప్పుకుంటారు. ఇది అసోం చరిత్రలో భాగం. నరకుని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం కామరూపదేశానికి పూర్వరాజధాని. ఇప్పుడు ఇది గువాహతీ సమీపంలోని జాతియా అనే ప్రాంతం. 
   
ఆనాడు కాకతీయులపై దండయాత్రలు చేసినవారు ఖిల్జీలు, తుగ్లక్లు. వేయి స్తంభాలదేవాలయాన్ని వారే ధ్వంసం చేశారు. కాజీపేట స్టేషన్ సమీపములో నేను చూచిన ఒక సమన్వయ దృశ్యం. కాకతీయ కళా తోరణం నమూనాపై ఏసుక్రీస్తు విగ్రహం, ఒక క్రైస్తవ ఆలయ పాఠశాల ముఖద్వారం!


The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...