Showing posts with label తత్త్వశాస్త్రం. Show all posts
Showing posts with label తత్త్వశాస్త్రం. Show all posts

Friday, January 19, 2018

కాలస్వరూపము - చరిత్ర

https://www.facebook.com/vallury.sarma/posts/501604209876997

https://www.facebook.com/vallury.sarma/posts/501927656511319

https://www.facebook.com/vallury.sarma/posts/502681373102614

https://www.facebook.com/vallury.sarma/posts/502958356408249

https://www.facebook.com/vallury.sarma/posts/503337006370384

నిన్న చెప్పిన ఈ వాక్యాలు మళ్ళీ చూదాం - అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు. అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు.
శ్రీ కృష్ణుడు చేసినది ధర్మ సంస్థాపన. భారత యుద్ధం తరువాత పరీక్షిత్తు రాజయ్యాడు. తరువాత అతడి కుమారుడు జనమేజయుడు, తరువాత 28 తరాలు (3100 బి.సి.ఇ. నుండి 1800 బి.సి.ఇ. వరకు) ఆ వంశం హస్తినాపురానికి, కురు సామ్రాజ్యానికీ మంచి పాలన అందించారు. బుద్ధుడు చేసినది మోక్షజ్ఞాన బోధ, కాని అది కలియుగంలోని ధర్మచ్యుతి. భారతీయచరిత్రకు చాలా ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. బుద్ధుడు సుక్షత్రియుడు. అతడు, కుమారుడు రాహులుడు భిక్షుకులవడంతో వారికి నిర్వాణం వచ్చి ఉండవచ్చు. కాని శాక్యరాజ్యం ఏమైనది? అరాజకమయినది. అశోకుడు కళింగ యుద్ధము తరువాత బౌద్ధుడయ్యాడు. తన కుమారుని కూడా భిక్షువును చేశాడు. అశోకుని సామ్రాజ్యం గాంధారం నుండి కర్ణాటక వరకు భారతదేశమంతా వ్యాపించింది. అతడి తరువాత మగధ సామ్రాజ్యం అంతరించినది. భారత మంతా అరాచకం ప్రబలినది. బౌద్ధ జైన ధర్మాలు గృహస్థులకు, సన్యాసులకు పనికి వస్తాయి. వారికి పరమ ధర్మాలు. రాజ్యమేలే రాజులకు కాదు. చాణక్యుడు చెప్పినట్లు రాజుకి కావలసిన విద్య - త్రయీ, అన్వీక్షకి, వార్తా, దండనీతి. అహింస కాదు. తన తండ్రుల, తాతల ధర్మాన్ని వదిలిపెట్టడం అశోకుని అజ్ఞానం. అతడికి గీతా బోధ చేసే వారు లేక పోయారు. అశోకుడు రాజ్యము, ప్రజల క్షేమాన్ని వదలి పెట్టి తన మోక్షాన్ని చూసుకున్నాడు మంచిదే. కాని అది మహరాజుగా ఉండి చేయవలసినది కాదు. తన తరువాత రాజ్యపాలనకు ఏర్పాట్లుచేసి తాను సన్న్యాసం స్వీకరించాలి. బౌద్ధంలో వర్ణమూ లేదు, ఆశ్రమమూ లేదు. ఈ విధముగా బౌద్ధము వ్యవస్థను భంగంచేసింది. బౌద్ధం భారతదేశంలో క్షాత్రానికి, దేశ రక్షణకు, విదేశీ దండయాత్రలను ఎదుర్కొనే శక్తికి సముచిత స్థానం లేకుండా చేసింది. ఆధునిక భారతంలో జైన, బౌద్ధాలను కొంతవరకు తెలివితక్కువగా అరాధించిన వారు గాంధీ, నెహ్రూ. నెహ్రూ పంచశీల మన దేశానికి తీరని నష్టం చేకూర్చింది. చైనాతో పంచశీల ఒడంబడిక చేసుకున్న నెహ్రూ 1962 చైనా దండయాత్రలో ఘోర పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. (Himalayan blunder of Nehru).

కలియుగంలో వేద ధర్మం క్షీణించింది. వేదాన్ని ప్రమాణం గా స్వీకరించని జైన బౌద్ధాలు మానవుని పరిణామానికి, వ్యక్తిగత వికాసానికి,తోడ్పడినా, నిర్వాణానికి మార్గముచూపించినా, చాలా హేతుబద్ధంగా కనబడినా, సమాజాని ధర్మ బద్ధంగా నడిపే కార్యంలో సనాతన ధర్మానికి సాటి రాలేకపోయాయి. దీనికి అనేక కారణాలున్నాయి.
1. భగవంతుని నిరాకరించడము వానిలోని లోపము. ఈశ్వర ప్రసక్తిలేని మతము, దేశము నిలువవు. ముఖ్యముగా మన దేశములో ఈశ్వరునియందు భక్తి ప్రతి భారతీయునకు జన్మతః వచ్చిన సంస్కారము. In God We Trust" అన్నా "సత్యమేవ జయతే" అన్నా ఒకటే. 2. బౌద్ధ సంఘం పై విశ్వాసము వలన మొదట్లో మతవ్యాప్తి జరిగినా వేయి సంవత్సరాలలో అదే మత నిర్మూలనకు కూడా దోహదం చేసినది. మహమ్మదీయ పాలనలో బౌద్ధసంస్థాగత కార్యక్రమాలన్నీ నాశనమైయ్యాయి. మనకు దేవాలయాలు అనేకం విధ్వంసం అయినా కుటుంబాలలో వ్యక్తులలో మిగిలిన శాస్త్రజ్ఞానము మతాన్ని కాపాడింది. 3. ఇతిహాస, పురాణాలు, దేవీదేవతలు వారి మతాలలో కూడా జాతక కథలు,దేవతలు, పురాణాలు ప్రవేశ పెట్టవలసి వచ్చినది. 4. న్యాయ శాస్త్రాన్ని బౌద్ధజైనులకంటె గొప్పగా సా.శ. 8 వ శతాబ్దమునుండి సనాతన ధర్మవాదులు అభివృద్ది చేశారు. శంకర, రామానుజ ,మధ్వా చార్యులంతా వాదనలో గొప్ప ప్రతిభ చూపించారు. శ్రీ హర్షుడు, మధుసూదన సరస్వతి, గంగేశోపాధ్యాయుడు, రఘునాథ తర్క శిరోమణి వంటి వారు జైన బౌద్ధాల వాదాన్ని తార్కికముగా ఖండించడంలో సఫల మయ్యారు. 5.తులసీ దాసు రామాయణం, మీరా, సూరదాసు వంటి వారి భజనలు, చైతన్యుని కృష్ణ భక్తి మార్గం,జ్ఞానేశ్వరుడు, తుకారాం, సక్కుబాయి వంటి మహారాష్ట్ర భక్తులు, వల్లభ సంప్రదాయం, అన్నమయ్య, పురందర దాసు, త్యాగయ్య వంటి వారల చరిత్రలు దేశమంతా భక్తి మార్గాన్ని ప్రచారంచేయడంతో సమాజమంతా ప్రభావితమైనది. 6. బౌద్ధ, జైనాలు చెప్పిన సాధన సామాన్యుల శక్తికి అందరానిదానిగా కనుపించింది.
సనాతన ధర్మం లో ధర్మమనే పదాన్ని నిర్వచింపడం అర్థంచేసుకోవడం కష్టం. సద్గురు శివానందమూర్తి గారి నిర్వచనాలు నాకు నచ్చినవి. Dharma is appropriateness in thought, action, attitude and judgment to a thing or a happening or a desire or an incident in life ఇలా చూస్తే అశోకుని బౌద్ధస్వీకరణ ఆపరిస్థితిలో ధర్మచ్యుతియే.

కాలస్వరూపము - చరిత్ర
కాలోస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు మిహప్రవృత్తం (భ.గీ. 11.311.32) భగవాన్ ఉవాచ - నేను లోకములను క్షయముచేయుటకు విజృంభించిన కాలమును. సంహారక్రియయే ఇప్పటి నాప్రవృత్తి. భగవంతుడే కాలము. అతడే కాలుడు (యముడు, కాళీదేవి). కాలము చక్రము వంటిది. ఒకటి కాదు మూడు కాలచక్రములున్నాయి అని బౌద్ధులు చెబుతారు. దలైలామా వంటి మతగురువులు పరిణతిచెందిన శిష్యులకు కాలచక్ర దీక్ష ఇస్తారు. 2006 లో ఆయన ఈ దీక్ష గుంటూరు జిల్లా అమరావతిలో ఇచ్చారు. తెలుగు సాహిత్యములో కాలతత్త్వజ్ఞానము కలవారు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయన వేయిపడగలు కాల ప్రభావాన్ని సూచించే అద్భుతనవల.
వేయి పడగల పాము విప్పారుకొనివచ్చి
కాటందుకున్నది కల లోన రాజును.
అనే గణాచారి పాటతో నవలా ప్రారంభం. ఇక్కడ పాము కాల సర్పం. వేయిపడగలు, భాగవత తత్త్వానికి ప్రతిబింబం. పరీక్షిత్తు పాముకాటుతో మరణిస్తే కలి విజృంభిస్తుంది. వృద్ధ జమిందారు మరణంతో సుబ్బన్నపేటలో కలియుగం ప్రారంభమౌతుంది.కాలగమనంలో సమాజంలో వచ్చే మార్పులను ఈ నవల అద్భుతంగా చిత్రిస్తుంది.విశ్వనాథ వారే ఝాన్సీరాణి అని ఒక పద్య ప్రబంధాన్ని వ్రాశారు. ఇది చారిత్రకం. 1857 నాటి కథ. ఆంగ్లేయులు సిపాయిల తిరుగుబాటుగా వర్ణించినదానిని మార్క్స్ ప్రథమ భారతీయ సంగ్రామం అన్నాడు. ఈ వైరుద్ధ్యం భారత చరిత్ర విశేషం. విశ్వనాథ వారి పీఠికను చూద్దాం. ఈ కావ్యమున కథానాయకుడు లేడు. లక్ష్మీబాయి కూడా చివరకు యుద్ధమున ఓడిపోయి మరణించును. నాయకుడు కాదు కదా, ఆమె కథానాయిక కూడా కాదు. ఇది ఆమెనుగూర్చిన వట్టి చరిత్ర కథ. ఏదోచేయవలెను.
"ఇంత పరాక్రమవంతురాలు కదా! భారతీయులదృష్టిలో రాజ ధర్మమును పాటించెను కదా! ఆమె ఎందుకు ఓడిపోవలయును? ఆమె సమకాలికులైన ఇతర భారతీయ రాజులు ఆంగ్లేయులకు దాసానుదాసులైరి. సీ!సీ! కాలము యొక్క మహిమ!లేనిచో ఆమె కథానాయకుడైయుండెడిది. విజయమును పొందెడిది. కావ్యము వీరరస ప్రథాన కావ్యమయ్యెడిది. అందుచేత కావ్యమును అధ్యాయములుగా విభజించి ప్రతి అధ్యాయముయొక్క ఆద్యంతములలోనూ కాలమును, దాని స్వరూపమును, దాని యవ లక్షణములను, దాని యుగధర్మము ననుసరించినడిచెడు పద్ధతిని వివరించితిని. కొంత దోషము పోయెనుకదా!” ఆధునిక యుగము. దాని లక్షణములు చరిత్రపై దాని ప్రభావము, ఇక్కడ ముఖ్య విషయములు. భారతదేశపు ప్రస్తుత అధోగతిని వివరించిన కవి విశ్వనాథ. ఆయన "తల వెనుకకు తిప్పియున్న జంతువు" అన్నాడో వామపక్ష విమర్శకుడు. విశ్వనాథ రచనలు అర్థంకాలేదు పాపం. వేదాన్ని ప్రమాణము కాదన్న అన్నలకు డాస్ కాపిటల్, మెగస్థనీస్ ఇండికా ప్రమాణాలు. రంగనాయకమ్మ విషవృక్షం, లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది ఆధునిక సాహిత్యం.


మనం భారత దేశ చరిత్రను సనాతన ధర్మ చరిత్రగా పరిశీలిస్తునాము. సనాతన ధర్మమంటే వేదవిహితమైన వైదిక మతము ఒకటే కాదని తెలుసుకున్నాము. అనాదిగా తర్క సహాయముతో మతాలను చర్చించడం మన ప్రాచీన విధానం. చార్వాకము, బౌద్ధము, జైనము, శైవము, వైష్ణవము, అనేక మార్గములు, దర్శనములు సనాతన ధర్మాన్ని ఒక కీకారణ్యముగా మార్చివేశాయి. ఉదాహరణకు ఒక వేద వాక్యం తీసుకుందాము. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి." ఆధునిక గురువులు దీనికి విపరీతమైన అర్థాలతో సంక్లిష్టం చేశారు. దీని అర్థము సరళమే. సద్వస్తువు ఒకటే, దానిని విప్రులు బహువిధములుగా చెబుతారు. విప్రులు అంటే ఎవరు? జ్ఞానులు. అనంతమును పరిమితమైన పదములతో ఎలా వర్ణిస్తారు? వారు ఊహించిన స్వల్ప విషయాన్ని చెబుతారు. దీన్ని ఆధునిక గురువులలో కొందరు అన్ని మతాలు, అందరు దేవుళ్ళు, అన్ని మార్గాలు ఒకటే అని చెబుతారు. వైవిధ్యం సృష్టి లక్షణమైతే, ఆ భేదాలు గమనించడం విజ్ఞానమైతే అన్నీ ఒకటే అనడం "అన్నమైతే నేమిరా? మరి సున్నమైతేనేమిరా?" అన్నట్లే ఉంటుంది.
సద్వస్తువును అర్థంచేసుకున్నా లేకపోయినా ఈ వాదనల వలన ఒక రకమైన ప్రజా ప్రభుత్వ చర్చా ధోరణి భారతదేశములో ప్రవేశించినది. రాజరికము, నియంతృత్వము, ప్రజాప్రభుత్వము, దొరతనము, వర్గపాలన అని అనేకరకాల ప్రభుత్వాలు ఉన్నాయి సృష్టిలో. సనాతన ధర్మము లేదా హిందూ మతము సంపూర్ణ ప్రజా ప్రభుత్వము. కొందరు పీఠాధిపతులు, ప్రవచనాలు ఇచ్చేవారు, గురువులు ఉన్నా వారి ప్రభావం అతిస్వల్పం. పాలకులు లేని ప్రజా సముదాయమే హిందూమతము. రోమన్ కాథలిక్ మతమును రాజరికము అనవచ్చును. పోప్ మకుటమున్న మారాజు. అందుకే ఆయనను భారత ప్రభుత్వము కూడా రాజ, దౌత్య లాంఛనాలతో ఆహ్వానిస్తుంది. పాకిస్తాన్ ది ఒకరకమైన వర్గ పాలన - కాని అక్కడ కూడ సైన్యాధికారులు, వర్తకులు, సున్నీ మతాధిపతులు పాలక వర్గ పాలనయే. షియాలు వెనుకబడినవారు, అహ్మదీలు, హిందూ, క్రైస్తవులు అస్పృశ్యులు లేదా బలిపశువులు. అమెరికా, ఇండియా ఇతర ప్రజా ప్రభుత్వాలలో కూడా వర్గ పాలన లేకపోలేదు.అందుకే ఆక్స్ ఫర్డ్ చరిత్ర ఆచార్యుడు ఇప్పటికీ ప్రభుత్వాల శక్తి నాలుగు వర్గాల సంఘర్షణ మీద ఆధారపడి ఉంటుదన్నారు. ఇప్పుడు వర్తకులు, సైన్యాధిపతులు, రాజకీయవాదులు/మేధావులు ఆవరుసలో అధికారం పంచుకుంటే పాలితులెప్పుడూ రైతులు, కార్మికులు, కూలీలు. ఇది ఒకరకంగా వర్ణ విభజన శాశ్వతత్త్వమే.


మనము భారతీయ చరిత్రలో సుమారు సా.శ. 1000 కి వద్దాము. ఆసమయంలో మనదేశ చరిత్రను ఇద్దరు వ్యక్తులు ప్రభావితము చేశారు. మొదటివారు ఆది శంకరాచార్య భగవత్పాదులు. ఆయన కాలమును గురించి విభేదాలున్నాయి. శృంగేరి శారదాపీఠము వారి ప్రకారము ఆయన కాలము సా.శ. 788-820. (కంచి కామకోటి వారి ప్రకారము ఆయన కాలము సా.శ.పూ 509-477.) (ఆది శంకరులు, అభినవ శంకరులు అని ఇద్దరున్నారా? అనే వాదముకూడా ఉన్నది.) తన అద్వైత వేదాంతముతో ఆయన అప్పటికే క్షీణదశలో ప్రవేశించిన బౌద్ధ జైనాలను తన పాండిత్య ప్రతిభతో, తర్కముతో ఎదుర్కొన్నారు. అంతకుముందే దేశమంతా వ్యాపించినది ఎక్కువగా శైవము. కాశ్మీరునుండి కన్యాకుమారివరకు శైవ ప్రభావము ఉన్నది. బసవేశ్వరుని వీరశైవము ఆమతానుయాయులైన లింగాయతుల ప్రభావము నేటి కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నది. వంగ, కామరూప (బెంగాల్, అసోం, బంగ్లా) వంటి ప్రాంతాలలో శాక్తేయం బహుళ ప్రచారంలోనికి వచ్చినది. మధ్యయుగంనాటికి మనదేశ చరిత్రపై సనాతన ధర్మంలోని పరిణామాలకంటె విదేశీదండయాత్రలప్రభావం ఎక్కువ అవి దేశ చరిత్రగతినే మార్చివేశాయి. మన చరిత్ర గతి మార్చిన రెండవ వ్యక్తి సుల్తాన్ మహమద్ ఘజనవీ (ఘజనీ మహమ్మదు) (సా.శ. 971-1030). ఒక విధంగా ఆయన పై ప్రభావము చూపింది ఇస్లాం మతము. దాని వ్యవస్థాపకులు ముహమ్మద్ ప్రవక్త (సా.శ. 570-632). ఆ కాలములో ప్రపంచమును అత్యధికంగా ప్రభావితము చేసిన వ్యక్తి. ఆనాటి ధార్మిక, రాజకీయ, సైనిక బలాలలో ఆయనకు ఎదురులేదు. భగవంతుని చేత ఆదాము, నోవా, అబ్రహాం, మూసా, ఈసా (యేసు)ల తరువాత పంపబడిన ఆఖరి ప్రవక్త అని ఆమతస్తుల ప్రగాఢ విశ్వాసం. భారతదేశ చరిత్రలో కూడా శంకరాద్వైతము, ఇస్లాం మతము, క్రైస్తవమతము ప్రముఖ పాత్ర వహించాయి. నేటికీ వహిస్తున్నాయి. ప్రపంచజనాభాలో క్రైస్తవులు సుమారు 33 శాతం అయితే, ముస్లిములు 22 శాతం, హిందువులు 10 శాతం, బౌద్ధులు 5 శాతం, చైనీయ ప్రాచీన మతాలు 5 శాతం అనుకోవచ్చు.ఇంకా అనేక మతాలున్నాయి. ఆధునిక భారతీయ సమాజాన్ని మతదృష్టితో పరిశీలించడానికి గుర్తుంచుకోవలసిన విషయం 1947లో విభజన తరువాత ఏర్పడిన దేశాలు - ముస్లిం పాకిస్తాన్ (1971 తరువాత ముస్లిం పాకిస్తాన్, ముస్లిం బంగ్లాదేశ్), హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్, నాస్తిక, మతదృష్టి రహిత ఇండియా, లేక భారత్. ఇండియా ఈ అందరిదీ. ఈవిశ్లేషణ దేశానికీ, ప్రజలకూ, సంస్థలకూ కూడా వర్తిస్తుంది.



ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన

https://www.facebook.com/vallury.sarma/posts/501245056579579

ఆధునిక కాలంలో బౌద్ధ ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన రాజకీయ నాయకులలో ప్రముఖుడు బాబాసాహెబ్, భీమరావు అంబేద్కర్. హిందూసమాజంలో అస్పృశ్యత కూ మతానికి సంబంధము ఉన్నట్లు భావించిన డాక్టర్ అంబేద్కర్ జీవితకాలమంతా ఈ అస్పృశ్యతకు కారణాలేమిటని పరిశోధించి, వారి కులము వారు పూర్వము బహుశ బౌద్ధులేమో అని నిర్ణయానికి వచ్చారు. కాని సనాతన ధర్మము గురించికూడా పూర్తిగా తెలిసిన ఆయన దానికి సమీపవర్తియైన బౌద్ధాన్ని తన మరణానికి కొన్ని నెలల ముందు స్వీకరించారు. ఆయన అనుయాయులు కొందరు కూడా ఆయనను అనుసరించారు. ఆధునిక భారత చరిత్రలో ఇది ఒక శుభపరిణామం. 

జైన, బౌద్ధమతాల తర్కం అప్పటి వైదికుల తర్కంకంటె బలంగా ఉండడం వలన దానికి తాత్కాలికంగా విజయం లభించి మేధావి వర్గంలో ఆ మతాలకు ఆదరణ వచ్చినది. మహారాజులు. పండితులు, బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులు ఆకర్షితులయ్యారు. వర్ణ వ్యవస్థలేకపోవడంలో సమాజంలో ఇతరవర్గాలు కూడా ఆకర్షితులయ్యారు. మన చరిత్ర పుస్తకాల ఆధారంగా బుద్ధుడు, మహావీరుడు సా.శ. పూ. 500 ప్రాంతంలోని వారు. కాని వారి సాహిత్యం అధారంగా ఆ మతాలు ఎంతో ప్రాచీనమైనవి. 22 వ తీర్థంకరుడే కృష్ణుని సమకాలికుడంటే ఆదినాథుడు ఎప్పటి వాడు? చంద్ర గుప్త మౌర్యుని కాలం గ్రీకు యాత్రికుడు మెగస్థనీసు ఇండికా ఆధారంగా నిర్ణయించారు. అందులో ఉన్న విషయం "అప్పుడు పాలింబొత్రా లో సాంద్రకొత్తాస్ అనే రాజు ఉండేవాడు". ఇతడు పాటలీపుత్రపు రాజు చంద్రగుప్త మౌర్యుడని నిశ్చయించారు. కాని అతడు గుప్త చంద్రగుప్తుడో, సముద్రగుప్తుడో కావచ్సుకదా! ఇదే సత్యమైతే బుద్ధుని కాలము సా. శ. పూ. 1100 అవుతుంది.
స్వల్ప కాలంలో బౌధ్ధ జైనాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అశోక చక్రవర్తి కళింగయుద్ధములో లక్ష సైనికుల మృతదేహాలను చూచి విషాదం చెంది బౌద్ధమతం స్వీకరించాడని అంటారు. ఇది అర్జున విషాదయోగానికి విపర్యయం. అర్జునుడు బంధుమిత్రుల మరణాన్ని ఊహించుకొని శోకిస్తే, కృష్ణుడు ధైర్యం చెప్పి గీత బోధించి యుద్ధోన్ముఖుణ్ణిచేశాడు.అశోకుడు దేశమంతా బుద్ధుని బోధలను రాళ్ళపై చెక్కించి ప్రచారం చేశాడు. తన పుత్రుడు మహేంద్రను, కుమార్తె సంఘమిత్రను బౌద్ధసంఘములో భిక్షువులుగా చేసి సింహళానికి (నేటి శ్రీలంకకు) పంపించాడు. ఆంధ్రదేశంలో శాతవాహనులు వైదికమతస్త్థులైనా బౌద్ధాన్ని ఆదరించారు. వారి భార్యలు భర్తల పక్కన కూర్చుని యజ్ఞాలు చేశారు. బౌద్ధ విహారాలకు కానుకలు ఇచ్చారు. ఇక్కడ మతమార్పిడి అన్న ఇతరమతాల ప్రక్రియకు ఆస్కారంలేదు. బుద్ధుడు ఏర్పాటుచేసిన వ్యవస్థలలో ముఖ్యమైనది సంఘం. ఇది భిక్షువుల సముదాయం. వీరు విహారాలలో ఉండి ధర్మ బోధ చేసేవారు. వీరిని రాజులు పోషించేవారు. తరువాత కాలంలో అన్నిదేశాల విద్యార్థులను ఆకర్షించిన తక్షశిల, నలంద, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచ ఖ్యాతి వహించాయి. ఒక్క వేయి సంవత్సరాలలో తిరిగి సనాతన ధర్మం ఏవిధంగా బహుళ ప్రచారాన్ని పొందింది? ఈ మతాలు ఎందుకు ప్రజాదరణ కోల్పోయాయి? భారతీయ చరిత్రపై ఈ మతాల ప్రభావం ఎంత?



కానీ అంబేద్కర్ కృషి ఫలితాలను అనుభవిస్తున్న చాలామంది ఆయన అనుసరించిన బౌద్ధాన్ని మాత్రం వదిలేసి, భారతీయత ఏమాత్రం లేని క్రైస్తవం వైపు పోతున్నారు.
మీరు చెప్పినది నిజమే. కాని కాల స్వభావము వలన కొందరుపురోగమిస్తే కొందరు వెనుకకు నడుస్తారు. కాని నా ఉద్దేశ్యం- వాళ్ళకి కూడా తెలిసి వస్తుంది. అటునుండి ధన ప్రవాహం వచ్చినంత వరకు ఇప్పటి కథ నడుస్తుంది. అది వెను తిరిగి నపుడు ఆసౌధం కూలిపోతుంది. ఐరోపాలో పరిస్థితి అదే. అమెరికా పౌరులైనవారు భారతీయత కోల్పోయినట్లే మత మార్పిడుల వలన ప్రజాపతులనుండి మారి, అబ్రహాంకు దత్తపుత్రులౌతారు. వారి మూలాలు భారతదేశం నుండి మధ్య ఆశియాకు మారతాయి. ఇప్పటికే లేకపోతే హైదరాబాదు నుండి జెరూసలెం Direct flight వస్తుంది. సమాజానికి మార్పులు సహజం


గాంధీ – జైనం



ఆధునిక భారత చరిత్రలో కూడా జైన బౌద్ధాలకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈనాడు మన దేశంలో 80 లక్షల మంది బౌద్ధులు, 40 లక్షల మంది జైనులు ఉండ వచ్చును. జైన మతం కూడా ఐహిక జీవనంలో ప్రవర్తనకు ముఖ్య స్థానం ఇస్తుంది. ఈమతం 24 మంది తీర్థంకరుల ద్వారా వ్యాప్తి చెందినది. 24 వ తీర్థంకరుడు మహావీరుడు స్థాపకుడని చరిత్ర పుస్తకాలు చెబుతాయి. ఆయన బుద్ధుని సమకాలికుడు.
జైనుల న్యాయ తర్కాలు కూడా బౌద్ధుల న్యాయము వలెనే వైదికుల న్యాయము కంటె శక్తివంతమైనది. వారి న్యాయాన్ని అనేకాంత వాదము, స్యాద్ వాదము, నయ వాదము అని చెబుతారు. అనేకాంతవాదమంటే పరస్పర విరుద్ధమైన, వ్యతిరేకమైన భావాలను జైనం అంగీకరిస్తుంది. వారి న్యాయం లో ఈఅంగాన్ని నయవాదము అంటారు. సప్తభంగినయం అంటే - స్యాదస్తి, స్యాన్నాస్తి, స్యాదస్తి చ నాస్తి, స్యాదవక్తవ్య, స్యాదస్తి చ అవక్తవ్య,స్యాన్నాస్తి చ అవక్తవ్య, స్యాదస్తి చ నాస్తి చ అవక్తవ్య. May be it is, May be it is not, May be it is and is not, May be it is indescribable, May be it is and is indescribable, May be it is not and is indescribable, May be it is, it is not and is indescribable" దేవుడున్నాడా? అంటే జైనుడికి ఎలా అన్నా సంతోషమే, బహుశా ఉన్నాడు, బహుశా లేడు, బహుశా ఉన్నాడో లేడో, బహుశా అనిర్వచనేయుడేమో... ఇలా ఏడు రకాలు. This is an ancient Indian exposition of FUZZY LOGIC. జైనమత ప్రభావం మనమీద ఇంతా అంతా కాదు. 67 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ సమస్యకైనా అనేకాంతవాదం చేయడం మన ప్రజల, మన ప్రభుత్వ విధానంగా మారిపోయింది. ఒక ఉగ్రవాదికి శిక్షవేయడానికి కూడా మనకు దశాబ్దాల కాలం పడుతుంది. మనము ఏప్రశ్న నైనా "అంధగజన్యాయం" (Elephant and the blind) తోనే పరిష్కరించడానికి పూనుకొని విఫలమౌతాం.
జైన మతంలో ముఖ్యాంశాలు - అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఆధునిక యుగంలో రాజకీయాలలో వీనిని ప్రబోధించినవాడు గాంధీ మహాత్ముడు. నిజానికి ఆయనను ప్రచ్ఛన్న జైనుడు అనవచ్చును. క్షత్రియులు స్థాపించిన జైనమతాన్ని పోషించి, ఆదరించినవారు వైశ్యులు. మహావీరుని కుమారులు భరతుడు, బాహుబలి. బాహుబలినే గోమఠేశ్వరుడు అంటారు. ఆయన అరిహంత. మానవునిగా పుట్టి నిర్వాణము పొందినవాడు. "ఓం నమో అరిహంతానాం" జైనుల ధ్యానమంత్రం. (బౌద్ధులు ఓం మణిపద్మేహం అంటారు.) ఆయన విగ్రహం, కర్ణాటక లోని హసన్ జిల్లా , శ్రావణ బెళగోళ లో చూడవచ్చు. గోమఠేశ్వరునినుండి వచ్చినపేరే కోమటి. స్వాతంత్ర్యయోధులలో తిలక్ బ్రాహ్మణుడు, అరవిందుడు, సుభాష్ బోస్ క్షత్రియులు, గాంధీ వైశ్యుడు. స్వభావాలలోని వ్యత్యాసం గమనింప వచ్చు.

Nandiraju Radhakrishna జైనుడు-గాంధి; క్షత్రియులు-వైశ్యులు అద్భుత వివరణ ఇచ్చారు. తిలక్, అరవిందుడు, సుభాష్ చంద్రబొస్, గాంధి మధ్య వైరుధ్యాలను గొప్పగా ఆవిష్కరించారు. ఇవి ఈ తరాలకు తెలియాలి..వందనాలు..


An Indian Marxist historian, D D Kosambi's dedication of his work on Bhartrhari is as follows
నూతన మానవ సమాజస్య పురశ్చరణం మార్క్స్-ఎంజెల్స్-లెనిన్- నామధేయాం తేజస్వినాం మహామానవానాం పునీత స్మరణార్థం (To the sacred memory of the great and glorious pioneers of today's society, Marx, Engels and Lenin)



కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. PART 2

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944

గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.

Nandiraju Radhakrishna ఆలోచనా శక్తి కలిగించేందుకు, జ్ఞానజ్యోతి వెలిగించేందుకు, వ్యక్తిత్వాన్ని తట్టిలేపేందుకు నిరంతరం మీరు నిర్వహిస్తున్న భావ సంపద పంపిణీ యజ్ఞం వల్ల కొందరిలోనైనా గుణాత్మక మార్పువస్తునదన్నది నా విశ్వాసం. మీరు రోజూ వివరించే ఇవన్నీ ఈ తరానికి ఎవరు చెబుతారు? మీబోటివారు చెప్పినా మాబోంట్లు అనుకునేది " ఇవన్నీ ఎవరికి కావాలి. ఇవి చదూతూ కూర్చుంటే మన సంగతి చూసుకొవద్దా? వాటినిస్కూళ్ళలో చెబుతారు. నా గురించి, నా ఘనత గురించి ఎవరూ చెప్పరుకదా! అందుకే నాగురించి నేనే చెప్పుకుంటా. అందుకయ్యే ఖర్చులేదుగా? అనే మార్కెటింగ్ ధోరణి మితిమీరిపోయింది. సామాజిక మాధ్యమం కూడా యాజమాన్య నిర్వాహక మాధ్యమంలా ప్రచార సాధనమైంది. రోజూ వేదికలపై, టీవీల్లో, రేడియోల్లో మన జాతి, మన చరిత్ర, మాతృభాష భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయమంటూ గొంతులు చించుకోవడం మినహా దానికి మనంగా చేస్తున్న కృషి ఏమిటన్న ఆత్మ పరిశీలన ఎవరికున్నదండీ! ఇప్పుడంతా "లై"కింగులు, షే"రింగులు" .. ఇదొక్కటే కొలమానం. "ఎవరినన్నా కొమ్ము కాసే రాజకీయాలైతే మరీ భేష్.. లాభ దాయకం. మనం మన మతం గురించి మాట్లాడితే మరి నాకేంటి? అన్నేదే కీలకం ఇప్పుడు. ఇదంతా "ఎర్నలిస్టుల" కాలం. మీ ప్రతి వాక్యాన్ని భద్రపరుచుకుంటున్నా! ధన్యుణ్ణి.

http://www.udaypai.in/am-i-a-hindu/

P Mallikarjuna Rao Our ancestors have not used the term religion. They called it Dharma. Buddha also called his teachings Dhamma. this is more comprehensive and a better term than religion. " Matam" means opinion, that is why Hindi "Matdan" means casting vote , expressing one's preference or opinion.

కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు.

https://www.facebook.com/vallury.sarma/posts/499821023388649

https://www.facebook.com/vallury.sarma/posts/500026073368144

https://www.facebook.com/vallury.sarma/posts/500138283356923

https://www.facebook.com/vallury.sarma/posts/500458073324944


కలియుగంలో సనాతన ధర్మంతో సహజీవనం చేసినవి జైన, బౌద్ధ మతాలు. మనతప్పుల తడకల చరిత్ర పుస్తకాలను పక్కన పెడితే - మనకు లభించే ఆధారాలు గ్రంధాలు. సాంప్రదాయ నిర్ణయం ప్రకారం కృష్ణుని సమకాలికుడైన వేదవ్యాసుడు వ్రాసినవే భారత, భాగవతాలు. కృష్ణుని తరువాత వచ్చినది బుద్ధావతారం. ఈ ఊహకు ఆధారం భాగవత శ్లోకం. (భాగవతం - 1.3.24)
తతః కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురాద్విషామ్ |
బుద్దో నామ్నా జినసుతా కీకటేషు భవిష్యతి ||
తరువాత కలియుగంలో సురద్వేషులైన నాస్తికులను సమ్మోహన పరచుటకు కీకట దేశంలో బుద్ధుడనే పేరుతొ జినసుతుడుగా ప్రభవిస్తాడు. ఈ బుద్ధుడెవరు? 12వ శతాబ్దపు జయదేవుని అష్టపది ప్రకారం గౌతమ బుద్ధుడు గుర్తుకు వస్తాడు --
నిందతి యజ్ఞవిదే రహః శ్రుతిజాతం, సదయ హృదయ దర్శిత పశుఘాతం
కేశవ ధృత బుద్ధ శరీరా, జయ జగదీశ హరే ||
కాని భాగవత శ్లోకం లో జినసుత అనే పేరు, ఆ బుద్ధుడు వేరు అని సూచిస్తుంది. జైనం తో సంబంధాన్ని సూచిస్తుంది. దానికి అర్థం వసుదేవుడు జినుడు. వాసుదేవుడు జిన సుతుడు. దీనికి గ్రంధాలలో ఆధారాలు లేకపోలేదు. వసుదేవుడి సోదరుడు. సముద్రవిజయుడు. ఆయన కుమారుడు అరిష్టనేమి. ఆయన 22 వ జైన తీర్థంకరుడుగా ప్రసిద్ధుడు. ఆయననే నేమీనాథుడని పిలుస్తారు. శ్రీకృష్ణుడు కూడా జైనుల 63 ప్రసిద్ధ పురుషులలో ఒకడు. (ఆ గ్రంధం పేరు త్రిషష్ఠి శలాక పురుషా). బలదేవుడు కూడా వారిలో ఒకడు. భాగవతము పంచమ స్కంధంలో వృషభదేవుని విష్ణువు అవతారంగా భావించిన కథ ఉంది. వృషభదేవుడు మొదటి తీర్థంకరుడు. ఆయనకు ఆదినాథుడన్న పేరు కూడాకూడా ఉంది. ఆయనది ఆపేరుతో శివతత్త్వం అని కొందరి భావన. మన సనాతన ధర్మ చరిత్రలో జైన, బౌద్ధాలను, చార్వాక (లోకాయత) మతంతో సహా సనాతన ధర్మంలొభాగాలుగా నాస్తిక దర్శనాలుగా చూడాలి.
బౌద్ధ జైనాలు వైదిక మతానికి విరుద్ధమైనవి, ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు? అహింసా పరమో ధర్మః అని బోధించిన జైన తీర్థంకరులు, బుద్ధుడు క్షత్రియులు. అశోకుని వంటి చక్రవర్తులుకూడా బౌద్ధంవైపు మళ్ళారు. క్షత్రియులు క్షాత్రాన్ని వదలి ఇటు ఎందుకు నడిచారు? బౌద్ధ జైన తత్త్వ వేత్తలలో అధిక సంఖ్యాకులు బ్రాహ్మణులే. అందుకే సాహిత్యమంతా తిరిగి సంస్కృతం లోనే వచ్చింది.? దీనికి కారణం ఏమిటి? నేటి క్రైస్తవం సమాజంలో అట్టడుగు వర్గాలను మొదట ఆకర్షించింది. దీనికి దానికి భేదమేమిటి? ఇప్పటి చరిత్రను అర్థంచేసుకోడానికి ప్రాచీన చరిత్ర ఉపయోగిస్తుంది.


జైన, బౌద్ధాల గురించి తెలుసుకునే ముందు కొంచేం తర్కం నేర్చుకోవాలి. ఈ క్రింది వాక్యాలు సత్యమో అసత్యమో చెప్పండి.
1. సూర్యుడు తూర్పున ఉదయించును.
2. 1+1 = 2
3. 1+1 = 10
4. కాంతి కిరణములు ఋజు మార్గములో ప్రసరించును.
5. యేసు క్రీస్తు శిలువవేయబడెను.
6. జగమే మాయ.
7. విజ్ఞాన శాస్త్రము చెప్పు ఏవిషయము నిత్య సత్యము కాదు.
8. యేసు క్రీస్తు డిసెంబరు 25 న పుట్టెను.
9. రాముడు, కృష్ణుడు మధ్యకాలము సుమారు 1000 సంవత్సరములు.
10. ఉత్తరమున ధ్రువనక్షత్రము వలెనే దక్షిణమున కూడా ఒక నక్షత్రము ఉన్నది.




ఎందుకు ఉన్నత వర్గాల ప్రజలు జైన, బౌద్ధ మతాల వైపు ఆకర్షితులయ్యారు?
ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మతాలను తులనాత్మకంగా అధ్యయనం చేయాలి. మతాలను అనుసరించే వాళ్ళ ప్రతిక్రియ వేరువేరుగా ఉంటుంది. అన్ని మతాలు ఒకటే అనేవారు కొందరు, మాదే సత్యమైన మతం, మా దేవుడు, మా మతం, మా పుస్తకం, ఇదే అంతిమ సత్యం అనేవారు కొందరు. మా మతం గురించి మీరు మాట్లాడితే, మీకు ex parte శిక్ష విధిస్తాం, అనేవారు కూడా లేక పోలేదు. మతాలన్నీ మానవాళికి మత్తుమందులు అంటూ పరమ సత్యం మా సామ్యవాదమే అనేవారు కొందరు. అందుచేత కేవలం భారతీయ తత్త్వ శాస్త్ర దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానం అన్వేషిద్దాం. వేదం మహర్షుల నుండి శ్రుతి గా మనకు లభించింది. వందలాది ఋషుల తపస్సు ఫలం అది. తరువాత కాలంలో అది అర్థం అవడానికి 6 వేదాంగాలు (వ్యాకరణం జ్యోతిషం మొదలైనవి) అవసరమయ్యాయి. వాటిలోని తత్త్వాన్ని అర్థం చేసుకోడానికి దర్శనాలు పుట్టాయి. ప్రపంచ, లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గ్రహించడానికి ముఖ్యంగా తెలుసుకోవలసినవి. న్యాయ, వైశేషికాలు - గౌతముడు, కణాదుడు వీటి సూత్ర గ్రంధకర్తలు. English equivalents are logic (epistemology) and ontology. ప్రత్యక్షము,అనుమానము, శబ్దము, ఉపమానము అనే ప్రమాణాల ద్వారా సత్యాన్వేషణ చేయడం న్యాయ శాస్త్ర పరిధి లోనిది. ఇది వైదిక మతానికి శాస్త్రము. దీని ద్వారా యథార్థ జ్ఞానాన్ని గ్రహించి, మిథ్యా జ్ఞానాన్నిపరిహరించడం ఉద్దేశ్యం. కాని చార్వాకుడికి ఒకటే ప్రమాణం - ప్రత్యక్షం. దేవుడు లేడు. ఉంటే చూపెట్టు - ఇది వాని వాదం. సనాతన వాదులకు ఈశ్వరుడు అనుమాన, శబ్ద ప్రమాణాల ద్వారా సాధ్యం. శబ్దం అంటే శ్రుతి, ఆప్తవాక్యం. బౌద్ధులకు, జైనులకు ప్రత్యక్ష, అనుమానాలు మాత్రమే ప్రమాణం. అందుచేత వాళ్ళకు వేదం ప్రమాణం కాదు. గౌతమ న్యాయం కంటే బౌద్ధుల న్యాయ శాస్త్రం ఎక్కువ అభివృద్ధి చెందినది. నాగార్జునుడు, దిఙ్నాగుడు, ధర్మకీర్తి గొప్ప నైయాయికులు. దూరంగా కొండమీద పొగవస్తూంది. అంటే కొండమీద నిప్పు ఉంది అని చెప్పడం అనుమానం. ఇది చెప్పడానికి ఆధారం. "యత్ర యత్ర ధూమః , తత్ర తత్ర వహ్ని"ఎక్కడ పొగ ఉంటే అక్కడ నిప్పు ఉంటుంది" అనే న్యాయవాక్య అవయవం. ఈ నిప్పుకు, పొగకు ఉన్న అవినాభావ సంబంధాన్ని వ్యాప్తి అంటారు. ధూమాన్ని హేతువు అంటారు. దీన్ని ఉపయోగించి విషయాన్ని తెలుసుకోవడమే హేతువాదం. మన హేతువాదులకు తెలియనిది. ఈ శాస్త్ర జ్ఞానం వలన, వాదంలో బౌద్ధులు జైనులు, వైదికులపై విజయం సాధించారు. వారి వాదనలు ఎక్కువ హేతుబద్ధం గా ఉండేవి. వైదికులు "స్వర్గ కామయ యజేత" "యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది " అనేమాటలతో అప్పటి ప్రజలను నమ్మించలేక పోయారు. ప్రజలకు దేవుడు, స్వర్గం, యజ్ఞం గురించి మాట్లాడే మాటలు అంధ విశ్వాసాలుగా తోచాయి. వ్యక్తీ, సమాజం (జగత్తు) ప్రత్యక్షాలు. దేవుడు అనుమాన ప్రమాణంతోనే సాధ్యమౌతాడు. వారి వాదం బౌ ద్దుల, జైనుల న్యాయం ముందు ఓడిపోయింది. ఉన్నత వర్గాల ప్రజలు వాటివైపు ఆకర్షితులయ్యారు.




గౌతమ గోత్రజుడు, శాక్యవంశ రాజకుమారుడైన సిద్ధార్థుడిచేత బోధింపబడినది బౌద్ధధర్మం. ఆయన ప్రపంచంలోని దుఃఖానికి, దాని పరిహారానికి కారణం అన్వేషించడానికి, రాజభవనాన్ని, భార్యా పుత్రులని, తండ్రిని వదలి తపస్సుకి వెళ్ళిపోతాడు. అనేక సంవత్సరాలు గడిచాక ఆయనకు జ్ఞానోదయం అయి, బుద్ధుడని పిలవబడ్డాడు. ఆయన మొదట చెప్పినవి నాలుగు సత్యాలు (చత్వారి ఆర్య సత్యాని). అవి 1. సంసారం దుఃఖమయం. జన్మ,జరా,వ్యాధి, మృత్యువు అన్నీ దుఃఖాలే. 2. కోరికలు దీనికి కారణం. అవే జనమరణ చక్రానికి కూడా కారణం. 3. దుఃఖ నిరోధము (కాంక్షను త్యజిస్తే దుఃఖం దూరమవుతుంది), 4. దీనికి మార్గము (అష్టాంగ మార్గం). సమ్యగ్వచనము (మంచిమాట), సమ్యగ్కర్మ (మంచి పనులు), సమ్యగ్జీవనము (మంచి జీవితం), సమ్యగ్వ్యాయామము (మంచి ప్రయత్నం), సమ్యగ్స్మృతి (మంచి దృక్పధము), సమ్యగ్సమాధి (మంచి ధ్యానము), సమ్యగ్దృష్టి (సత్యాన్ని చూడడం), సమ్యగ్సంకల్పము (మంచి సంకల్పము). ప్రధానంగా వీటిని గమనింప వచ్చును. 1. గౌతమ బుద్ధుడు గురువు, (బుద్ధం శరణం గచ్ఛామి) 2. మధ్యేమార్గం , కార్య కారణత్వం (Dependent origination), నాలుగు పరమ సత్యాలు, అష్టాంగ మార్గం - ఇది బౌద్ధ ధర్మం. (ధర్మం శరణం గచ్ఛామి) 3. సామాన్యులు, సంఘ పరివారంలోనివారు కూడా సాధన ద్వారా నిర్వాణం పొందవచ్చును. (సంఘం శరణం గచ్ఛామి) నిర్వాణం పరమోత్కృష్ట గమ్యం . ఈనాటి హిందువులుగా మనం దీనిని పరిశిలిస్తే మనకు విరుద్ధ భావాలు ఏవీ కనుపించవు. ఇది నిజంగా ఉపనిషత్తుల మతమే. ఒకే ఒక భేదం ఈశ్వర ప్రసక్తి లేదు. కాని గురువుని అంగీకరించారు కదా. ఇంచుమించు కొంతవరకు నేటి షిర్డీ సాయిబాబా నూతన సంప్రదాయాన్ని పోలి ఉండవచ్చు. మనకు పాశ్చాత్యులు వ్రాసిన చరిత్ర, ఇంగ్లీషు భాష ఉపయోగం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. మతం అనే పదాన్ని మనం religion అనే పదానికి గతిలేక అనువాదంగా వాడుతున్నాము. కాని religion, religious conversion మత మార్పిడి అనే మాటలు మనకు పూర్తిగా అర్థం కావు. దిలీప్ కుమార్ ముస్లిం అయితే రహమాన్ గా మారి తీరాలి. శివారెడ్డి, శామ్యూల్ శివారెడ్డి గా మార వచ్చు. బాప్తిజం అనేప్రక్రియ ఉంటుంది. కాని పేరు విషయంలో కొంత వికల్పం ఉంటుంది. హిందూ బౌద్ధమతాలలో హిందువు, బౌద్ధుడు అనే పదాలకు నిర్వచనం లేదు. ఇది రేపు ముచ్చటించుకుందాం.






Tuesday, January 16, 2018

నైతిక కార్యాచరణ (Moral Activity)

http://vaakili.com/patrika/?p=11390

మౌలిక విశ్వాసం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 3

త్మ యొక్క మూడు కార్యాచరణలగురించి స్థూలంగా చెప్పుకున్నాక, ఇప్పుడు నేను ఒక్కొక్క దానిగురించీ ప్రత్యేకంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా నైతిక కార్యాచరణ గురించి. ఈ నైతిక కార్యాచరణ ప్రయోగాత్మకమైనది. అది ఆచరణతోనూ, ఆచరణకి దారితీసే మానసిక స్థితులతోనూ కూడుకున్నది. ఒక మానసిక స్థితిని, దాని వల్ల కార్యరూపం ధరించే పనిని బట్టి అంచనా వెయ్యడమూ, పరీక్షించడమూ జరుగుతుంటుంది. అది నిజానికి కార్యాచరణలో భాగంగా, దానికి ప్రేరణగా భావించబడుతుంది. ఏది యుక్తమైనదో ఆ పనిని దానికోసమే ఆచరించడం నైతిక కార్యాచరణ అనిపించుకుంటుంది; అది నీతినియమాలకు కట్టుబడి ఉన్నంతవరకు, అది ఆచరణలో భాగంగా ఊహించబడుతుంది.

ఆత్మకి ఏది యుక్తమైనదో అది చెయ్యాలని తీవ్రమైన ఆకాంక్ష ఉంటుంది, బహుశా, ఈ ఆకాంక్షే మనసు యొక్క అన్ని ప్రక్రియల్నీ నియంత్రిస్తుంది. అయితే, ఆ ఆకాంక్ష నెరవేరిన సంతృప్తి ఆచరణలో తప్ప కేవలం ఆలోచనవల్ల సిద్ధించదు. ఎంత యుక్తమైన ఆలోచన అయినప్పటికీ, అది నైతిక కార్యాచరణరూపందాల్చినపుడు తప్ప సంతృప్తినివ్వలేదు. ఒక మంచి ఆలోచన, ఆచరణలో తప్పుగా పరిణమించినపుడు “ఆత్మ” తీవ్రమైన అసంతృప్తికి గురవడమే కాకుండా, ఒకరకమైన నిర్వీర్యతకి లోనవుతుంది. ఎందుకంటే, అంత మంచి ఆలోచనా కార్యరూపంలోకి వచ్చేసరికి దానికి తగిన సత్ఫలితాన్నివ్వక నిష్ప్రయోజనమైపోయిందికదా అని. అంటే ఒక ప్రక్రియ సజావుగా ప్రారంభమై, తప్పుగా ముగిసింది; లేదా తగిన ముగింపుకి నోచుకోలేకపోయింది; ఎందుకంటే, తప్పుడు ముగింపు ప్రక్రియలో భాగం కాకపోవడమే కాదు, దానికి సరిగా వ్యతిరేకము.

ఇతర తత్త్వచింతనలలో మనుషులు ఎందుకు ఏది మంచో అదే చెయ్యాలి అన్న విషయమై వేరే కారణాలు చూపించవచ్చు. మనుషులు మంచిని ఎలా గుర్తిస్తారన్నదానిమీద చాలా ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ఒక్కోసారి ముందు మంచి అనుకున్నది తర్వాత మంచికాకుండాపోవడం సంభవించవచ్చు. ఉదాహరణకి, అది ఉదాత్తంగా ఊహించిన … స్వలాభాపేక్ష కావచ్చు లేదా మానవజాతికంతటికీ ఆశించిన ప్రయోజనం కావొచ్చు. ఈ తత్త్వచింతనలు మంచి అనుకున్నది మంచికాకుండా పోయినపుడు, మనుషులు తాము మంచిచేశామన్న అనుభూతి ఎందుకు పొందుతారంటే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడతాయి; దానిని అంత ఆవేశపూరితంగా మంచిగానే ఎందుకు పరిగణించాలి? వేరొక రీతిగా పరిగణించకూడదు? అంటే, సమాధానం దొరకదు. అదే రకమైన ఇబ్బంది సత్యం విషయంలోనూ సౌందర్యం విషయంలోనూ ఎదురౌతుంది. వ్యక్తులు ఈ మూడింటినీ వాటికవే ప్రయోజనంగా భావించి విలువ ఇవ్వడమూ, ఆ విలువ ప్రదర్శించినపుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి చెందడమూ జరుగుతుంది; దేనికీ దానికోసమే విలువ ఇవ్వని అంశాలపై అదే రకమైన అనుభూతి చెందరన్నది అనుభవైక సత్యం.

అదే మనం ఆత్మతత్త్వాన్ని అంగీకరించగలిగితే, ఈ అనుభూతుల్నీ, ఈ విలువల్నీ విశదీకరించడానికి ప్రయత్నం చెయ్యనక్కరలేదు. ఆత్మ కేవలం ఏది మంచో, ఏది సత్యమో, ఏది సౌందర్యమో వేరే ప్రయోజనం ఆశించకుండా విలువ ఇస్తుందని సమాధానం చెప్పొచ్చు. శరీరానికి ఆహారం పట్ల ఎటువంటి అపేక్ష ఉంటుందో, ఆత్మకి ఈ మూడిటి పట్లా అదే రకమైన అపేక్ష ఉంటుంది. ఆత్మని ఎలా అయితే ఇతరత్రా విశదీకరించలేమో, వాటిని కూడా వేరే విధాలుగా విశదీకరించలేము. కనుక ఏది మంచి అని మనల్ని అడిగితే, ఆత్మ దేనికి వేరే ప్రయోజనం ఆశించకుండా మంచి అన్న విలువ ఆపాదిస్తుందో అదే మంచి అని చెప్పవచ్చు. ఆత్మ ఒక పనిని వేరే ప్రయోజనం ఆశించకుండా చేసినపుడు, అది మంచి చెయ్యడానికే ప్రయత్నిస్తుంది; ఈ కోరికని ఆచరణలో ఆటంకపరిచినా, వ్యతిరేకించినా మనం చెడే చేస్తాము.

అయితే ఒకమాట ఒప్పుకోవాలి. మనం అనునిత్యం మన చర్యల్ని అవి ఇతరులపై చూపే ప్రభావం ఆధారంగా అంచనా వేస్తాము. అది ఎందుకంటే, ఆత్మప్రమాణంలో ఇతరులకి మంచి చెయ్యడమే మంచి, హాని చెయ్యడం కాదు. ఆత్మ ఇతరులకి మంచి చెయ్యడం… ఏదో ప్రయోజనాన్ని ఆశించడం కాకుండా కేవలం మంచి చెయ్యాలన్న తలపు వలననే. కనుక మన చర్యల్ని అవి కలిగించే ఫలితాలబట్టి అంచనా వెయ్యాలి; మనం ఇతరులకి హాని చెయ్యకుండా, మంచి చెయ్యాలంటే ఎలా నడుచుకోవాలన్నదానిగురించి ఆలోచించాలి. మన చర్యల్ని అంచనా వెయ్యడం, మంచి చెయ్యాలన్నఆలోచనా ఇవన్నీ నైతిక కార్యాచరణలో భాగమే; అన్ని ఆ లక్ష్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా చేసే ప్రయత్నానికి ఉపకరణాలు అని గుర్తించాలి. ఆ ఒక్క విధంగా మాత్రమే మంచిచెయ్యాలన్న కోరికని కార్యరూపంలో పెట్టవచ్చు. ఒక రకంగా ఇది కళా కారుడి నైపుణ్యం లాంటిది; ఆ నైపుణ్యాన్నిబాగాచెయ్యాలన్న లక్ష్యంతో తప్ప వేరే విధంగా సాధన చెయ్యడం సాధ్యపడదు.

ఉదాహరణకి, ఒక వేళ నేను ఇతరులకి మంచిచేస్తూపోతున్నాననుకుందాం… ప్రతిగా వాళ్లు నాతో మంచిగా ఉంటారనో, లేదా నేను మంచి చేస్తున్నానన్న భావనని ఆనందించడానికో; అపుడు నేను మంచి ఆచరించే క్రమంలో వాళ్ళ క్షేమం ఆలోచించడం లేదు, నా క్షేమం గురించి ఆలోచిస్తున్నానన్నమాట. నేను వాళ్ళ యోగక్షేమం ఎప్పుడైతే ఆలోచించడం లేదో నేను వాళ్ళకి క్షేమం కలిగించేది ఎక్కడచేస్తున్నాను? వాళ్ళకి ఏది మంచో నాకెప్పుడు తెలుస్తుంది? వాళ్ళకి ఏది మంచో అది చెయ్యాలన్న కోరిక ఉన్నప్పుడు. నా కోరిక ఎప్పుడైతే వాళ్ళకి ఏది మంచో అది చెయ్యడం కాకుండా, నేను ఏది చేస్తే నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభం కలుగుతుందో అది అయినపుడు, నాకు వాళ్ళకి ఏది మంచో తెలుసుకునే అవకాశం కోల్పోతున్నాను.

ఇది మార్మికత కాదు. ఇది లోకజ్ఞానం. ఎప్పుడైతే నాకు కలగబోయే లాభం నా పరమావధి అవుతుందో, నేను ఎంతసేపూ నా లాభం గురించే ఆలోచిస్తాను తప్ప ఇతరులకి ఏది మంచో అది ఆలోచించను. నా ఆనందం కోసం వాళ్ళకి ఏది మంచో అది చేస్తున్నానని నన్ను నేను నమ్మించుకో వచ్చు; మభ్యపెట్టుకోవచ్చు. నిజంగా నా లక్ష్యం ఎప్పుడైతే అది కాదో, నా పరిశ్రమని నా నిజమైన లక్ష్యం నియంత్రిస్తూ, డబ్బు సంపాదించడమే ధ్యేయమైన కళాకారుడు కళలో ఎలా విఫలమౌతాడో, ఇతరులకి నిజంగా ఏదిమంచో అది చెయ్యడంలో అలా విఫలమౌతాను.

ఇతరులకి మంచి చెయ్యడంలో కేవలం క్రియ ఒక్కటే చాలదు, అది ఎలా చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. మరోలా చెప్పాలంటే, మనం మంచి ఆచరించే విధానం కూడా కార్యాచరణలో ముఖ్యమైన భాగమే. మొరటు ఉదాహరణ ఇవ్వాలంటే, నేను మరొక వ్యక్తికి ధనసహాయం చేస్తున్నపుడు, సహాయం చేస్తున్నందుకు అతను నన్ను ప్రేమించడమూ, లేదా ద్వేషించడమూ నేను అతనికి ఇచ్చే విధానం బట్టి ఉంటుంది. నేను ధనసహాయం చేసిన తర్వాత కూడా నన్ను ద్వేషిస్తున్నాడంటే, నాలో నేను అతనికి మంచిచేసేనని గర్వపడవచ్చునేమో గాని, నేను అతనికి ఏమాత్రం మంచి చెయ్యలేదన్నమాట. కనుక డబ్బు ఇవ్వడం అన్నది ఒక్కటే మంచికార్యాచరణ కాదు. అది ఏ విధంగా ఇచ్చేమన్నది కూడా కార్యాచరణలో అంతర్భాగమే. కాని, ఆ “విధానం” ఇస్తున్నపుడు నా మనసులో పొందే భావనమీద ఆధారపడి ఉంటుంది. నేను అతనికి నేను ధనసహాయం చేస్తున్నపుడు నేను చాలా ఉదారుడనన్న చైతన్యంతో ఇస్తే, ఆ ఇచ్చే విధానం తప్పు; అప్పుడు ఆ వ్యక్తి నే చేసిన ఉపకారానికి నన్ను ప్రేమించడానికి బదులు నన్ను అసహ్యించుకుంటాడు. నేను అతనికి ఇస్తున్నపుడు అది నాకు మంచి జరగాలనీ, అతను నన్ను ప్రేమించాలనీ అనుకోకుండా, నిరపేక్షగా ఇవ్వాలి. అతను మానసికంగానూ, భౌతికంగానూ లాభపడాలని సంకల్పించి ఇవ్వాలి.

మనం సామాన్యంగా నైతికతగురించి చెప్పేటపుడు, ముఖ్యంగా యువతకి బోధించేటపుడు, దురదృష్టవశాత్తూ మంచి చెయ్యాలన్నది చెపుతూ అదెందుకు చెయ్యాలన్నది మాత్రం చెప్పడం విడిచిపెట్టెస్తాం. నిజానికి మనం లక్ష్యం సరియైనదయినపుడే మంచి చెయ్యగలం; ఆ లక్ష్యం ఎప్పుడూ వేరే ఏదీ ఆశించకుండా మంచిని నెరవేర్చడమొక్కటే. అలాగే, సరియైన కారణం ఒక్కటే ఏది మంచో మనకి చెప్పగలదు. అదొక్కటే, దానిని నెరవేర్చడానికి తగిన కార్యాచరణ మార్గాన్ని కూడా సూచిస్తుంది. ఆ మార్గమే అనుసరించకపోతే ఆ ఆచరణే మంచిదికాకుండా పోతుంది. యువతకు బోధించే నైతికతలో చాల భాగం మంచిచెయ్యడంలో కలిగే ఆనందం మీద, ముఖ్యంగా చేసే వ్యక్తికి కలిగే ఆనందం మీదే దృష్టి పెడుతుంది. యువత ఈ అంతరార్థాన్ని త్వరగానే గ్రహిస్తుంది. నైతికత పర్యవసానం అన్నిసార్లూ ఆనందం కానక్కరలేదనీ, అటువంటి ఆనందాన్నినొక్కిచెప్పే నైతికతపట్ల వాళ్ళకి అంత ఆత్మసంతృప్తి కలగదనీ వాళ్ళు అతి త్వరలోనే తెలుసుకుంటారు. కాబట్టి ఈ రకమైన లాభాపేక్షతో కూడిన నైతికతపట్ల వాళ్ళు ఎదురు తిరిగి అల్లరి పనులు చేస్తుంటారు. పాఠశాలలలో విద్యార్థులు చేసే అల్లరిలో చాలభాగం వాళ్ళకి ఏమాత్రమూ సంతృప్తి కలిగించని ఈ లాభాపేక్షతో కూడిన నైతికతకి వాళ్లు గుడ్డిగా ఎదురుతిరగడం వల్ల కలిగిన పరిణామమే.

మగపిల్లలు తప్పుచెయ్యడం తప్పుగా తీసుకోరు. వాళ్ళు ఒకర్నొకరు తప్పు చెయ్యడానికి ప్రేరేపించుకుంటారు. వాళ్ళకి గురువులపట్ల అవిధేయత, దురాలోచనచెయ్యడం ఒక రివాజుగా మారుతాయి. అలా తప్పుచెయ్యడంలో వాళ్లకి తప్పుతోవపట్టిన నిరపేక్షత కనిపిస్తుంది. వాళ్ళు అల్లరి చేసినా, కనీసం వాళ్ళు ఆ అల్లరి ఏ ప్రతిఫలాన్ని ఆశించో చెయ్యడం లేదు; అంటే, వాళ్ళు “ఒక పనిని చేస్తున్నపుడు దానివల్ల కలిగే లాభంగాని, దండనగాని దృష్టిలోపెట్టుకోవాలన్న” అభిప్రాయాన్ని త్రోసిరాజంటున్నారు. ఈ రకమైన లాభమూ – దండన అన్న పద్ధతే వాళ్ళకి నచ్చదు. దానికి కారణం వాళ్లలో ఉన్న తప్పుచేయాలన్న కోరిక కాదు; ఈ రకమైన బహుమానం- శిక్షా అన్న చట్రంలోంచి వాళ్లలో ఉండే ఆత్మ తనను తాను స్వతంత్రంగా ఉంచుకోవాలని కోరుకోవడమే. వాళ్ళకి మంచి మంచికోసమే చెయ్యాలని చెప్పకపోవడం వల్ల, వాళ్ళు తప్పును తప్పుకోసం చేసి ఆ చట్రంలోంచి తప్పించుకోజూస్తారు. వాళ్లకి ఆదర్శంగా నడిచే కుర్రాడంటే ఇష్టం ఉండదు. కారణం అతడు ఈ బహుమానమూ – దండన అన్న చట్రానికి బానిసగా ప్రవర్తిస్తాడు. అతనికి నిరపేక్షగా ఏ పనీ చెయ్యడం తెలీదు. వాళ్ళు అతని తంతే, అతనిమిద అసూయకొద్దీ కాదు, వాళ్ళు బహుమతితోపాటు దండనకికూడా అతను అర్హుడే అని భావించడం వలన.

ఆ కుర్రాళ్ళకి మంచిని మంచికోసమే చెయ్యాలనీ, మంచితనం అంటే అందులోనే ఉందనీ మరెందులోనూ లేదని వాళ్ళకి అర్థం అయేలా చెప్పగలిగితే, ఈ విపరీత ధోరణినంతటినీ, కనీసం చాలావరకు, అరికట్టవచ్చు. నిరపేక్షగా ఏ పనినైనాచేసే వాళ్ళ సహజసిద్ధమైన స్వభావానికి ఎన్నడూ అవకాశం ఇవ్వము. వాళ్ళకి మంచితనం యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్పరు, ఒక వేళ చెప్పినా, ఆ చెప్పినది తప్పుగా చెప్పడంతో, వాళ్ళ విధ్యార్థి జీవితం చాలభాగం మంచితనం అంటే ఏమిటో తెలుసుకోకుండానే గడిచిపోతుంది. ఉపాధ్యాయులు తమ సౌకర్యానికి ఏది మంచి అని చెప్పేరో అదే వాళ్ళకి లీలగా మిగులుతుంది. అందుకనే తెలివైన, చురుకైన పిల్లల్లో నైతికత అన్నది ఒక సంప్రదాయం అన్న నమ్మకం మిగిలిపోయింది; అది సంప్రదాయమే, కానీ అది ఆత్మానుగతంగా వచ్చే నైతిక ప్రవర్తన అయినప్పుడే. (ఇక్కడ మనం సమ్యక్+ ప్రదానం = సంప్రదాయం (యుక్తమైనది విరివిగా ఇచ్చేది) అని గుర్తుపెట్టుకోవాలి.)

దండన విషయానికి వస్తే, ఇంటిదగ్గర తల్లిదండ్రులూ, పాఠశాలలో ఉపాధ్యాయులూ సాధ్యమైనంత స్పష్టంగా పిల్లలకి అర్థమయేలా తొందరగా చెప్పాలి. వాళ్లు దుష్టులనో, లేదా వాళ్ళని బాగుచెయ్యడానికో దండించడం లేదనీ, వాళ్ళు మంచికోసం మంచిగా ఉండాలితప్ప శిక్షను తప్పించుకుందికి మంచిగా ఉండకూడదనీ విశదపరచాలి. వాళ్ళని దండించడానికి కారణం వాళ్ళు ఇతరులకి గాని, తమకు తాము గాని హాని చేసుకోకుండా నివారించడానికేనని స్పష్టం చెయ్యాలి. అయితే, అటువంటి నివారణ మార్గాల్లో దండన ఉత్తమమైనదా కాదా అన్నది తల్లిదండ్రులూ, ఉపాథ్యాయులూ ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలి. కానీ, దండించాలన్న నిర్ణయం తీసుకున్నపుడు తగిన కారణం ఉండాలి, ఆ కారణాన్ని తప్పుచేసిన వాడికి తెలియజెయ్యాలి. అన్నిటికన్నా మిన్నగా, ధర్మాగ్రహంతో ఎవరినీ శిక్షించకూడదు, లేదా, శిక్షిస్తున్నపుడు ధర్మాగ్రహాన్ని ప్రకటించకూడదు. దానికంటే, కేవలం కోపంతో శిక్షించడం మెరుగు, దానివల్ల ఆ కుర్రాడు తాను ఒక చికాకు తెప్పించే పని చేశాను గనుక శిక్షింపబడ్డానని తెలుసుకుంటాడు, అంతే కాదు, ఆ దండన, తను జీవితంలో ఇలా చికాకు పరిచే పనులు చేసుకుంటూ పోతుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో హెచ్చరిస్తుంది. ప్రపంచం చికాకుపనులు చేసే వాళ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తుందన్నదానికి అది ఒక ఉదాహరణగా గుర్తిస్తాడు.

కానీ, దండన ముఖ్యంగా నియమాలను ఉల్లంఘించినందుకు విధించాలి. పిల్లలకి నిబంధనలు అందరి సౌకర్యానికీ ఏర్పచబడ్డాయనీ, నిబంధనల ఉల్లంఘన నైతిక ఉల్లంఘన కాదనీ, అది ఒక అసౌకర్యమనీ చెప్పాలి. పిల్లవాడు నిబంధనలకు కట్టుబడేలా ఉంచడానికి వేరే మార్గం లేకపోతే, తప్పనిసరి పరిస్థితిలో దండించాలి. దండన హేతుబద్ధం కాదనీ, కానీ అతను హేతుబద్ధంగా ప్రవర్తించని కారణంవలన, విధిలేనిపరిస్థితుల్లో అతన్ని శిక్షిస్తున్నామని తెలియజెప్పాలి. అతనికి అన్నిరకాలుగా నిబంధనలు ఉల్లంఘించడంవల్ల ప్రయోజనంచేకూరదని తెలియజెయ్యాలి. అయితే, ఈ ప్రయత్నంలో అతని నైతిక భావనకీ, స్వలాభానికీ మధ్య అవగాహనలో గందరగోళం సృష్టించకూడదు. అతను దాన్ని మాటల్లో చెప్పలేకపోయినా దాని గురించిన అవగాహన కలిగే ఉంటాడు. అతనికి అన్యాయం జరిగిపోతోందనీ, కొందరు అన్యాయంగా లబ్దిపొందుతున్నారనే భావనతో ఎవరూ పసిగట్టలేకుండా ప్రతి నియమాన్నీ ఉల్లంఘించడంద్వారా తన అసహనాన్ని ప్రకటించుకోవచ్చు. కానీ, నైతికతకోసమే నైతికంగా ప్రవర్తించాలని అభిలషించే అతనిలోని ఆత్మ, నిజమైన కారణం కాకుండా, ఏదో కారణం చూపి నైతికంగా ప్రవర్తించాలని చెప్పినపుడు, ముందు ఆశ్చర్యపడి, తర్వాత ఎదురుతిరుగుతుంది.

ఆ విధంగా ప్రతి పసివాడిలోనూ ఉన్న ఆత్మకి కొన్ని కోరికలుంటాయన్న ప్రతిపాదనమీద నైతిక బోధన ఆధారపడి ఉండాలి. ఆ బోధన ఈ కోరికని బలపరుస్తూ, అదేమిటో పిల్లవాడికి విశదమయేరీతిగా ఉంటే, కుర్రవాడికి అతను మంచే చెయ్యాలనీ, ఆ మంచిని మంచికోసమే తప్ప మరేదీ ఆశించి చెయ్యకూడదనీ తెలుసుకోగలుగుతాడు. అతను విధేయుడుగా ఉండడానికి వేరే మార్గాలు అనుసరించవచ్చు; కానీ, అపుడు అతను తన ఆత్మచెప్పినట్టు కాకుండా వేరెవరి ఆదేశాలనో అనుసరిస్తుండడంవల్ల, అటువంటి విధేయత కనపరచవలసిన అవసరం తప్పిపోగానే, విద్య అతనికి వికసనాన్ని కలిగించడానికి బదులు గందరగోళాన్ని సృష్టించడంతో, అతనికి మార్గదర్శన చెయ్యడానికి అతని అంతరాత్మ తప్ప వేరేదీ మిగలదు.

మౌలిక విశ్వాసం ఆత్మ తత్త్వం (The Ultimate Belief… A. CLUTTON-BROCK) – అధ్యాయం 2

http://vaakili.com/patrika/?p=11241

తాబ్దాల ఆలోచనా స్రవంతితో మానవ స్వభావం గురించీ, విశ్వం స్వభావం గురించీ తత్త్వశాస్త్రం ఒక సత్యాన్ని ప్రకటించింది, ఆ పని ఒక్క తత్త్వశాస్త్రం మాత్రమే చెయ్యగలదు. ఆ సత్యం అందరికీ చెప్పాలి అందరూ తెలుసుకోవాలి. పిల్లలలకి చిన్నప్పటినుండీ క్రమంగా పరిచయం చెయ్యాలి; అది వాళ్ళకి చెబుతున్నకొద్దీ, దానిమీద వాళ్ళు పరిశ్రమ చేస్తున్న కొద్దీ వాళ్ళకి దానిమీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం చదువుని అర్థం అయ్యేలా చేస్తుంది; జీవితం అంటే అవగాహన కలిగిస్తుంది; అది సవ్యంగా ఆలోచించగలిగిన ప్రతి వారూ ఆహ్వానిస్తారు, కారణం అది మానవాళి ఆకాంక్షలకి సమాధానాలు చెబుతుంది. దాన్నే మనం “ఆత్మ తత్త్వం” అంటాము.

తత్త్వశాస్త్రం ‘మన’లోని ఒక భాగానికి “ఆత్మ” అని పేరుపెట్టింది… దానికీ కొన్ని కోరికలుంటాయిగాని, అవి శరీరానికి ఉండే కోరికలవంటివి కావు. ఈ ఆత్మని దాని కోరికలద్వారా తెలుసుకోవచ్చు; వాటిని సంతృప్తి పరచడానికి వేరే మార్గాలు కావాలి. ఆత్మకీ ఒక స్వభావం ఉంది, అది దాని ప్రాధాన్యతని స్థిరపరచుకుని, మానవ స్వభావం గురించీ, ఈ సృష్టి స్వభావం గురించీ కొన్ని నిర్దుష్టమైన సత్యాల్ని ప్రకటించింది… వాటిని ఎవరికి వారు స్వయంగా పరీక్షించి నిర్థారించుకోవచ్చు. ఈ ఆత్మతత్త్వం ఏమిటి చెబుతుందంటే, ఆత్మ మూడు ముఖ్యమైన విషయాలు కోరుకుంటుందనీ… ఆ కోరుకోవడం వాటిని అందుకోవడం కోసమే తప్ప వేరే ఇతర ప్రయోజనాలు ఆశించి కాదనీ. అది మంచిపని చెయ్యడంకోసం ఏది మంచో తెలుసుకోవాలనుకుంటుంది, ఏది సత్యమో తెలుసుకుందికి సత్యం స్వభావం ఏమిటో తెలుసుకోవాలనుకుంటుంది; ఆ మూడవకోరికని ఇంత స్పష్టంగా చెప్పలేను గాని, ప్రస్తుతానికి వేరే వ్యాఖ్యానాలేవీ చెయ్యకుండా సౌందర్యాన్ని కోరుకుంటుందని మాత్రం చెబుతాను (65-నుండి 68 పేజీలలో దీన్ని నిర్వచించడానికి ప్రయత్నించేను). ఈ మూడు కోరికలూ, ఈ మూడే మూడు కోరికలు … ఆత్మ కోరుకునే కోరికలు; వీటికీ మిగతాకోరికలకీ ఉన్న తేడా ఏమిటంటే, ఈ కోరికలని అవిగా అందుకుందికీ, లేదా తీర్చుకుందికీ తప్ప వేరే ప్రయోజనం ఆశించి ప్రయత్నం చెయ్యకూడదు, నిజానికి చెయ్యలేము కూడా. ఉదాహరణకి, నాకు లాభం కలుగుతుంది కదా అని నేను మంచిని కోరుకుంటే, నేను మంచిని కోరుకుంటున్నట్టు కాదు, కోరుకుంటున్నది దానివల్ల పొందబోయే లబ్దిని. నేను ఏది సరియైనదో అది చేస్తాను. కాసేపు, అలా చెయ్యడానికి కారణం ‘సరిగా చెయ్యడానికి’ మించి ఏదో స్వలాభం ఉంది అనుకుందాం. అప్పుడు నా లక్ష్యం అపసవ్యంగా ప్రవర్తించడం వల్ల నెరవేరుతుందనుకుంటే దాన్ని సాధించడానికి నేను అపసవ్యంగా కూడా ప్రవర్తించి ఉండొచ్చు, కనుక నేను సత్యాన్ని కనుక్కోవడం దానివల్ల పొందబోయే లాభకోసం అయినప్పుడు, నా లక్ష్యం సత్యం తెలుసుకోవడం కాదు, దానివల్ల పొందబోయే ప్రయోజనం. పొందబోయే ప్రయోజనం ఆధారంగా సత్యాన్ని నమ్మవలసి వచ్చినప్పుడు, నా లక్ష్యం ఏది అసత్యమో దాన్ని నమ్మమని చెబుతుంది, దానివల్ల నాకు లాభం చేకూరుతుంది కనుక. నిజానికి సత్యాన్ని తెలుసుకుందికి ఒకటే మార్గం: దాని ప్రయోజనం సత్యాన్ని తెలుసుకోవడమేనా లేక వేరే ప్రయోజనం ఆశించా అన్నదానిబట్టి; అలాగే సరియైన మార్గంలో నడవడం దానికోసమే, వేరే ప్రయోజనం కోసం కాదు.

ఆత్మకి మూడే మూడు కోరికలు కాబట్టి, దానికి అనుగుణంగా మూడే మూడు కార్యాచరణలు కూడా ఉన్నాయి:అవి, నైతికవర్తన, మేధోపరిశ్రమ, సౌందర్యాన్వేషణ. మనిషి ఆత్మ తత్త్వపు ఈ మూడు కోరికలూ తీర్చుకుందికే కృషిచేస్తాడు, దానికి వేరే కారణం అంటూ ఏదీ ఉండదు. జీవితం గురించి చెప్పే ఏ ఇతర సిద్ధాంతమైనా, దానిని ఎలా నిర్వచించినా, దాని అంతరార్థం ఇదే: మనిషి జీవించాలి కాబట్టి జీవిస్తాడు, నిరంతరం అతని కార్యకలాపాలనన్నిటినీ ఈ ఉన్నతమైన విలువలు ఖండిస్తూనే ఉంటాయి. అయితే, ఈ ఉన్నతమైన విలువలూ, కార్యాచరణలూ జీవించడానికి అవి అంత ముఖ్యమైనవి కానపుడు, ఎందుకు వీటిని ఉన్నతమైనవిగా మనిషి పరిగణిస్తున్నాడో చెప్పలేము. కాని ఆత్మతత్త్వం … “జీవించడమనే ప్రక్రియ” వీటిని అందుకునే పరిశ్రమకంటే దిగువస్థాయి కార్యకలాపమనీ, మనిషి కేవలం బ్రతకడం కాకుండా, ఈ మూడుకోరికలనీ తీర్చుకుందికి ప్రయత్నించినపుడు, అతని జీవితం కూడా సంతృప్తికరంగా ఉంటుందనీ… చెబుతుంది.

ఇది తత్త్వశాస్త్రపు ముసుగులో ఉన్న వేదాంత సిద్ధాంతం కాదు. ఇది అనుభవం నుండివచ్చినది, కనుక, అనుభవానికి హత్తుకుంటుంది. మంచిని మంచికోసమే అనుసరించినపుడు, మనిషి మంచిగా ఉండడమే గాక, మంచితనం అంటే ఏమిటో అర్థం చేసుకోగలడని ప్రయోగాత్మకంగా ఋజువుచెయ్యబడ్డది. మనిషికి స్వతహాగా మంచిని కోరుకునే గుణం ఉంది, అది కేవలం మంచిని మంచికోసం అనుసరించినపుడే ఆ కోరిక ఈడేరుతుంది. సత్యం విషయంలోనూ అంతే. అలాగే ఆత్మతత్త్వానికి చెందని కార్యకలాపాలు కొనసాగించినపుడు దీనికి విరుద్ధమైన అభిప్రాయం కూడా నిజమని అనుభవం చెబుతోంది. అవి ఎప్పుడూ సాధనాలే తప్ప, లక్ష్యాలు కాకూడదు; మన ఆత్మ అభిలషించే కార్యకలాపాలని వాటిని సాధనాలుగా భావించి పరిశ్రమించినపుడే మనం సరిగ్గా ప్రయత్నించగలం, మనకి కావలసిందీ దొరుకుతుంది. మనం జీవించడం కోసం జీవిస్తే, మనం సరిగా జీవించనూ లేము, మనకి జీవితం సంతృప్తిగానూ అనిపించదు. జీవించడంకోసం జీవించడమన్నది, మనకి ఎలా జీవించాలో చెప్పదు. అతని ఆత్మగతమైన కోరికలు తీర్చుకోవాలంటే, మనిషి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. బదులుగా, ఆరోగ్యంగా ఉండడంకోసం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తే, దాని గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడంటే, అనారోగ్యం పాలవుతాడు. అలాగే, తన ఆత్మకోరుకునే కోరికలు నెరవేర్చుకుందికి తినాలి. కానీ, తినడం కోసం తింటూ కూచుంటే, అతను అతిగా తిని, దాని వల్ల అతని శరీరమూ, మనసూ పాడయి, తను తినడంలోని ఆనందాన్నికూడా ఆస్వాదించలేకపోతాడు.

పాఠకుడికి ఈ చెప్పినదాంట్లో విశేషం ఏమీలేదనీ, అందరికీ తెలిసిందే అనిపించవచ్చు. కానీ, ఆ చదువరి, ఉపాధ్యాయుడైతే, ముఖ్యంగా ఈ సత్యాన్ని గుర్తించమని చెప్తాను: ఆత్మకి మూడు ముఖ్యమైన కార్యకలాపాలున్నాయి. అవి ఆత్మకి సంబంధించినవి గనుక వాటినన్నిటినీ సమపాళ్లలో, వాటి సాధనకోసమే సాధన చెయ్యాలి. మన తత్త్వ చింతనలోనూ, మన విద్యావిధానంలోనూ ఈ సత్యాన్ని మరిచిపోతున్నాము. ఉన్నంతలో, మన విద్యావిధానం ఈ విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల అటు విద్యార్థుల్నీ సంతృప్తిపరచలేకపోతోంది; మన తత్త్వచింతన మనల్నీ సంతృప్తిపరచలేకపోతోంది. ఇంగ్లండులో ఉపాధ్యాయులకీ, నైతికవాదులకీ ఒక నిశ్చితాభిప్రాయం ఉంది, అది ఆత్మకి ఒకటే కోరిక ఉందనీ, అది మంచికోసం మంచి చెయ్యడం తప్ప మరే లక్ష్యం ఆశించకూడని నైతిక వర్తనమనీ, మేధో పరిశ్రమ, సౌందర్యాన్వేషణ నైతిక వర్తనకి ఉపకరణాలు తప్ప అవి ఆత్మకు సంబంధించినవి కావనీ. దాని అంతరార్థం, పైకి అలా చెప్పకపోయినప్పటికీ, మన విద్యా విధానంలో సత్యాన్ని అన్వేషించాలి, ఎందుకంటే దానివల్ల మనకి ప్రయోజనం ఉంటుంది గనుక; సౌందర్యాన్ని సృష్టించడమో, అనుభవించడమో చెయ్యాలి, అది మనకి ఆనందాన్ని ఇస్తుంది గనుక. నైతిక వాదులు, వాళ్ళు నిజంగా నైతిక వాదులయితే, ‘ఉపయోగకరంగా ఉండడమూ’, ‘ఆనందాన్నివ్వడమూ’ నీతికి ఆనుషంగికాలని సరిగ్గా గ్రహిస్తారు. కానీ, అతను ఎక్కడ తప్పుతున్నాడంటే, ఉపయోగకరమవడాన్ని బట్టి నీతినీ, ఆనందం ఇవ్వగలగడాన్ని బట్టి సౌందర్యాన్నీ పరీక్షిస్తున్నాడు. మేధోపరమైన పరిశ్రమ చాలా ఉపయోగకరం, అలాగే నైతిక వర్తన కూడా. కానీ, వాటి లక్ష్యం ఉపయోగకరంగా ఉండడమూ, ఆనందం ఇవ్వడమూ అయినప్పుడు, వాటిని సరిగా సాధించలేము. సౌందర్యాన్వేషణ ఆనందాన్నిస్తుంది, మేదోపరమైన పరిశ్రమలాగే; కానీ ఆనందం ఇవ్వడమే దాని లక్ష్యం అయినప్పుడు, దానిని సరిగా సాధనచెయ్యలేము. ఈ మూడు ఆత్మతత్త్వాలలో ఏ ఒక్కటీ దాన్ని దానికోసం సాధించలనుకుంటే తప్ప, అవి అవి కాలేవు. ఈ సత్యాన్ని మనం గ్రహిస్తేతప్ప, ఈ తాత్త్విక కార్యకలాపాలు మనం అనుసరించనూ లేము, ఇంకొకరికి అనుసరించమని చెప్పనూ లేము.

ఏ తత్త్వచింతనా లేకపోవడం వల్ల ఇంగ్లీషు ఆలోచనా విధానంలో వచ్చిన పెద్ద లోపం: ప్రతి దాన్నీ మరొకదానితో ప్రామాణీకరించుకుని, మనం దాని గురించి అంతా పూర్తిగా చెప్పేసేమనుకోవడం. కాని నిజానికి మనం చేసినది ప్రామాణికంగా తీసుకున్నదానితో సరిపోల్చడం మాత్రమే. అందుకే, మనం “నిజాయితీ అన్నిటికంటే ఉత్తమమైన మార్గము” అన్నప్పుడు, మన మనసులో ‘నిజాయితీ’ అనగానే వేరొకదాన్ని ఊహించుకుంటూ, మెచ్చుకుంటున్నాము. మనం ఊహించుకుంటున్నది నిజాయితీ కాదు, ప్రయోజనకారిత్వం. నిజాయితీ ప్రయోజనకారిత్వం ఒకటి కాదు; అదొక నైతిక లక్షణం. అది అదే. దాని కోసమే దాన్ని అభిలషించాలి. మీరు దాన్ని ప్రయోజనకారిత్వంగా భావించుకుంటే, నిజాయితీ ఏమిటో తెలుసుకో లేరు. కనుక మీరు విద్యార్థికి “నిజాయితీ అన్నిటిలోకీ ఉత్తమమైన మార్గం అన్నప్పుడు” మీరు తరచు ‘ఏది నిజం కాదో’ అది చెబుతున్నారు. త్వరలోనే అన్నివేళలా నిజాయితీ ఉత్తమమార్గం కాదని అతను స్వయంగా తెలుసుకుంటాడు; అపుడు అతను నిజాయితీకి బదులు తంత్రము ఎన్నుకోవచ్చు, ఎందుకంటే అతనికి నిజాయితీ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేదు, కాపట్యానికి బదులుగా నిజాయితీ ఎందుకు ఎంచుకుని అనుసరించాలో ఎవరూ బోధించలేదు. అతనిలో ఒక ఆత్మ (అంతర్గతమైన వ్యక్తిత్వం) ఉందనీ, అది నిజాయితీని వేరేదీ అపేక్షించకుండా కోరుకుంటుందనీ; అతని వ్యక్తిత్వంతోనూ అదే సత్యమనీ, దాన్ని తనపై ప్రయోగం చేసుకోవడం ద్వారా ఆ సత్యాన్ని ఋజువుచేసుకోవచ్చనీ విద్యావిధానం అతనికి అవగాహన అయేలా స్పష్టంగా బోధించాలి. అతను నిజాయితీ కోసం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినపుడు, అతనికి ఆత్మసంతృప్తి కలుగుతుంది; కానీ అతను ఏ ప్రయోజనం ఆశించి చేసినా నైతిక వర్తన సంతృప్తి కలిగించదు. అతను నైతిక వర్తనని వేరే ప్రమాణాలతో ఊహించుకుంటున్నప్పుడు, అతనికి నైతికత, నైతికతగా కనిపించదు, అతనికి ఆత్మ సంతృప్తి దొరకదు. మనకి నైతికతని వేరే ప్రమాణాలతో చూడడం తప్పని తెలుసు గాని … మనం అనునిత్యం చేసే పని అదే. ఆత్మయొక్క ఇతర కార్యకలాపాలని గుర్తించే దాకా ఈ రకమైన ప్రవృత్తినుండి తప్పించుకోలేము. అంతే కాదు, ఈ కార్యకలాపాలు ఆత్మప్రేరితాలు గనుక ఏదీ రెండో దానికంటే తక్కువది కాదన్నది కూడా గ్రహించాలి. మనం గ్రహించవలసిందీ, బోధించవలసిందీ, సత్యం విలువ అత్యంతమనీ, అది మంచితనానికి ఏమీ తీసిపోదనీ, అలాగే సౌందర్యం విలువకూడా అత్యంతమూ, మిగతా రెండింటికీ తీసిపోదనీ. ఈ విషయం తత్త్వవేత్తలు చర్చించడానికి ఇది కేవలం ఒక వాదము కాదు. ఇది అందరికీ తక్షణావసరమైన ఒక సత్యం, కనుక అన్ని రకాల విద్యావిధానాలలోనూ ప్రవేశపెట్టవలసినది. సత్యాన్ని సత్యం కోసం విలువైనదిగా గణించకపోతే, నేను సత్యాన్ని కనుక్కోలేను. సౌందర్యానికి సౌందర్యంకోసం విలువనివ్వకపోతే, నేను సౌందర్యాన్ని, చూడలేను, వినలేను, ఏ రకంగానూ అనుభూతి చెందలేను. నైతికవాది మరోలా భావించవచ్చు గాక, గానీ, మనం సృష్టి తత్వాన్నీ, మానవుని మనస్సునీ అతని లక్ష్యాలకి అనుగుణంగా మార్చలేము. జీవిత సత్యాలని ఎదుర్కోవడం నైతికవాదంలోని అంతర్గత సమస్య. ఒక వ్యక్తి ఇతరులకి ఉన్న సత్యాల్ని లేనట్టు చెబితే అతను నైతికతకోసం అనైతికంగా ప్రవర్తిస్తున్నట్టు; దానర్థం అతను నైతిక విలువల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడని.

‘ఒక నైతిక లక్ష్యంకోసం నేను ఏ సత్యాన్నైనా కనుక్కోవడానికి ప్రయత్నిస్తే, బహుశా నేను సత్యాన్ని కనుక్కోలేకపోవచ్చు’ … అన్నది యదార్థం. దానికి కారణం, నా లక్ష్యం నేను ఉన్నవి ఉన్నట్టుగా చూడలేకుండా చేస్తుంది; నేను వాటిని నా నైతిక లక్ష్యానికి అనుగుణంగా ఎలా చూడాలని అభిలషిస్తానో అలా చూడడం ప్రారంభిస్తాను. లక్ష్యం అనుభవానికి ప్రతిబంధకమౌతుంది. అందుకే సౌందర్యాన్ని ఒక నైతికలక్ష్యంకోసం చూడలేమన్నది రూఢం. ఇది అందమైన కళారూపాల్ని తయారుచేసే సందర్భంలో ఇంకా స్పష్టంగా అవగాహన అవుతుంది. ప్రపంచాన్ని మంచిగా చేద్దామన్న లక్ష్యంతో కళాకారుడు పనిచేస్తే, అతను సృష్టించేది కళాఖండం కాదు. నైతిక అంతఃకరణ ఉన్నట్టే, మనందరిలోనూ ఒక మేధోపరమైన అంతఃకరణా, సౌందర్యాత్మకమైన అంతఃకరణా ఉన్నాయి. నేను నైతికంగా ఉండాలని అనుకున్నప్పుడు నా నైతిక అంతఃకరణకి విధేయుడిగా ఉన్నట్టు, నేను మేధోపరంగా, సౌందర్యాత్మకంగా సరిగ్గా ఉండాలంటే, నేను నా మేధోపరమైన అంతఃకరణకీ, సౌందర్యాత్మకమైన అంతఃకరణకీ విధేయుడినై ఉండాలి. అన్ని అంతఃకరణలూ ఆత్మకు సంబంధించినవి కనుక ఏ ఉత్తరోత్తర ప్రతిఫలాన్నీ ఆశించకుండా వాటికి విధేయులమై ఉండాలి. ఈ ఆత్మకి సంబంధించిన విలువలన్నీ “పరమ” (supreme) విలువలు; మన ఆత్మ చెప్పినట్టు వాటికి ఆ విలువ ఇవ్వకపోతే, మనం మన జీవితాలనీ, ఈ విశ్వాన్నీ విలువకట్టడంలో విఫలమౌతాము. ఈ సృష్టిని ఎందుకు విలువైనదిగా పరిగణించాలంటే, ఇందులో సత్యమూ, సుందరమూ రెండూ ఉన్నాయి; మన చేతలలో మంచిని ఎలా గుర్తించగలుగుతున్నామో, జీవించడమనే ప్రక్రియద్వారా అలాగే సత్యాన్నీ సౌందర్యాన్నీ కూడా గుర్తించగలం. నిజానికి, ఈ సృష్టిలోని సత్య, సౌందర్యాల ఎరుకలేకుండా, చేసేవన్నీ సహజంగా మంచిచేయగల మానసిక స్థితికి చేరుకోలేము. మన నైతికశక్తి మిగతా రెండు ఆత్మశక్తులవల్ల సంపన్నమై, వాటి ఆదేశానుసారం నడుచున్నపుడు మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది.

కనుక, సత్యం విలువ అన్నిటికంటే ఉత్కృష్టమైనది అని నమ్మని వ్యక్తి, నిజాయితీగా ఉండడంలో విఫలమౌతాడు, ఎందుకంటే దాని విలువ పట్ల అతనికున్న అపనమ్మకం వల్ల. మనం మంచిగా ఉండదలుచుకున్నప్పుడు మనకున్న మేధోశక్తులన్నీ వాటి పూర్తి పరిమితులకు వినియోగించుకోవాలన్నది వాస్తవం. ప్రకృతిసిద్ధంగా ఎక్కువ తెలివితేటలులేని వ్యక్తి సైతం మంచిగా ఉండడానికి అవకాశం ఉందన్నది కూడా వాస్తవమే. కనుక వ్యక్తి మంచిదనాన్ని ప్రభావితం చేసేది ఈ తెలివితేటల్ని ఉపయోగించే విధానమే గాని వాటి సహజమైన శక్తి కాదు. తెలివి ఒక సాధనం మాత్రమే. దాన్ని సవ్యంగా ఉపయోగించాలి. సవ్యంగా ఉపయోగించలేనపుడు, తప్పుగా ఉపయోగించబడి, మొత్తం వ్యక్తిత్వానికి చెడుపు చేస్తుంది. తెలివితేటల వెనుకనున్న నైతికాంశం అది. తన తెలివితేటల్ని గుడ్డలో చుట్టి, వాటిని సక్రమమైన మార్గంలో వినియోగించడానికి ఇష్టపడని వ్యక్తిని లోకం నైతికంగా గర్హిస్తుంది. నిజానికి ఈ మేధో శక్తి ఏ ఇతర ఆసక్తులూ లేకుండా సత్యాన్ని సత్యంకోసం కనుక్కోడానికి చేసే ప్రయత్నంలోనే సవ్యంగా ఉపయోగించబడుతుంది. ఇక్కడ ప్రశ్న మేధో శక్తిని ఏ లక్ష్యం ఆశించి ఉపయోగిస్తున్నామన్నది. మంచిదనాన్ని ఆకాంక్షించి నైతికవర్తన ఎలాగైతే మనం అనుసరిస్తామో, సత్యాన్ని కనుక్కోవాలన్న తపనకోసమే సత్యాన్వేషణ చెయ్యాలి. సత్యాన్ని కనుక్కోవడం ఒక లక్ష్యం కోసం తోవ తప్పించినపుడు, అది పూర్తిగా తోవతప్పి మన నైతిక వర్తనని కూడా దారితప్పిస్తుంది.

మనందరం అంతరాంతరాల్లో మంచిదనానికీ, సత్యానికీ, సౌందర్యానికీ ఒక అనుబంధం ఉందనీ భావిస్తూ ఉంటాము. అటువంటి అనుబంధం ఉందని అనుకునే భావన ఏదో శుష్కవాదం కాదు. అది విశ్వవ్యాప్తంగా మానవాళి అనుభవం మీద ఆధారపడినదీ, ఆ అనుభవం యొక్క వాస్తవికతని నొక్కి చెబుతూ, వివరించడానికి ప్రయత్నం చేసేదీను. మనందరం ఎప్పుడూ సత్యంలో ఏదో ఒక మంచి ఉంటుందనీ, మంచిదనంలో కొంత సత్యం ఉంటుందనీ, సౌందర్యంలో సత్యం ఉంటుందనీ అనుభూతిచెందుతుంటాము. దానికి కారణం ఈ మూడూ ఆత్మగతమైన చర్యల లక్ష్యాలు, ఆ మూడూ వాటిని వాటికోసం తప్ప వేరే ఇతరమైనవి సాధించడానికి ఉపకరణాలు కావు. మరో లక్ష్యాన్ని ఆశించి వాటిలో దేనిని సాధించ ప్రయత్నించినా, ఆశించినట్టు అవదు సరిగదా, దాని మౌలిక తత్త్వాన్ని గ్రహించగలిగే స్థితిలో మనం ఉండము.

ఈ వాస్తవాన్ని గ్రహించడంలోని వైఫల్యమే, నైతిక బోధనననంతటినీ పాడు చెయ్యడమేగాక, యువత దానిపై తిరుగుబాటు చేసేలా చేస్తోంది. యువత వాళ్ళ అనుభవపు పరిధిలో, దైనందిన జీవితంలో నైతిక ప్రవర్తన ప్రాముఖ్యత అవగాహనచేసుకోగలిగే స్థితిలో ఉండదు. కానీ, ఈ అనుభవ రాహిత్యమే తరచు పెద్దవాళ్ళకంటే ఎక్కువగా పిల్లలు మేధోపరమైన, కళాత్మకమైన కార్యకలాపాల విలువ ఇతర లౌకికవ్యాపారాల విలువకంటే ఉత్కృష్టమైనదని గ్రహించగలిగేలా చేస్తుంది. దాని విలువని ఉన్నతంగా ఊహించడంలో వాళ్ళకి అవగాహనతో కూడిన జ్ఞానం ఉందని అనలేముగాని, ఎక్కువ సందర్భాలలో వాళ్ళు ఆ విలువని చాలా తీవ్రంగా అనుభూతిచెందగలరు; వాళ్ళకి ‘ఒక్క నైతిక వర్తనకే’ అటువంటి ఉత్కృష్టమైన విలువ ఉందని చెప్పినప్పుడు దానితో ఏకీభవించక ఎదురుతిరుగుతారు. వాళ్ళ ప్రవర్తన సబబు కూడా; వాళ్ళ అంతరాంతరాల్లో ఆత్మప్రేరణమైన కార్యకలాపాలన్నిటిలో ప్రతి ఒక్క దానికీ అంతే ఉన్నతమైన విలువ ఉన్నప్పుడు, వాటిని గుర్తించక, నిరోధించి, నిర్బంధించినపుడు వాళ్ళలోని ఆత్మకూడా వాళ్ళతో పాటే తపిస్తుంది. దాని అన్ని శక్తులకీ ఉత్కృష్టమైన విలువ ఇవ్వడానికి నిరాకరించినందుకు, అలా తిరుగుబాటు చేస్తున్నది వాళ్ళ ఆత్మే. ఈ తిరుగుబాటునే అటు పిన్నలూ, ఇటు పెద్దలూ నైతిక వర్తనకి వ్యతిరేకంగా తిరుగుబాటుగా పొరపడుతుంటారు.

కనుక ఇప్పుడు కావలసింది, కేవలం నైతిక బోధన కాదు; అది దానంతట అది యువతరాన్ని సంతృప్తి పరచడంలో విఫలమౌతుంది, వాళ్ళకి ఆత్మకి సంబంధించిన మూడు కార్యకలాపాల్లోనూ బోధన కావాలి. యువతకి, వాళ్ళ ఆత్మకి మూడు శక్తులున్నాయనీ, మూడింటినీ, దేనికదే లక్ష్యంగా పరిశ్రమించాలనీ బోధించాలి.

ఆధ్యాత్మికబోధన… నీతి, బుద్ధి, కళ… ఈ మూడింటిలోనూ నిరపేక్షమైన బోధన. జీవితం లక్ష్యం ఈ మూడు శక్తుల్నీ దేనిమట్టుకు అదే లక్ష్యంగా చేసుకుని అభ్యసించాలని నొక్కి చెబుతూ, అలా అభ్యసించని మనిషి జీవితం జీవితంకాదని కూడా చెప్పాలి. ఆచరణలో నైతికతని మిగతా రెండింటికంటే స్థిరంగా అనుసరించవలసి వస్తుందనీ, కానీ మిగతా రెండూ పలచబడినపుడు, నైతికతని సరిగా అభ్యసించలేమనీ, కనుక సత్య, సౌందర్యాల రెండింటి ప్రేరణ ఎప్పుడు కలిగినా నైతికతకి విలువ ఇచ్చి ఎలా తల ఒగ్గామో, సత్య, సౌందర్యాలకి కూడా తలొగ్గి అభ్యసించాలని బోధించాలి.

ప్రతి వ్యక్తిలోనూ ఈ మూడు శక్తుల్నీ … నీతి, సత్యం, సౌందర్యం… అభ్యసించాలన్న కోరిక సహజంగా ఉంటుంది. విద్యావిధానం ఆ కాంక్షని పూర్తిగా అవగాహన చేసుకోగలిగేట్టు చేసి, శారీరకమైన అవసరాలన్నికంటే ఆత్మకి సంబంధించిన కోరికలని విద్యార్థి ఉన్నతమైనవిగా పరిగణించేలా ప్రోత్సహించాలి. ఆ చెయ్యడం కూడా ఏకపక్షంగా కొన్ని ఆదేశాలుగా కాకుండా, విద్యార్థికి ఆత్మ స్వభావాన్ని ఎంత సులభగ్రాహ్యంగా చెప్పగలిగితే అంత సులభంగా చెప్పి, అతని అనుభవంలోని ఋజువులతో అనుసంధానం చేస్తుండాలి.

అనుభవం లేకపోవడం వల్ల యువతకి వేటికి విలువ ఇవ్వాలో తెలియక, తమలో ఉన్న ఉత్తమమైన లక్షణాలని అవమానకరంగా భావిస్తుంటారు. ఒక కుర్రాడు మంచిపట్ల, అందంపట్ల, సత్యంపట్ల తనకు సహజంగా ఉండే కోరికకి సిగ్గుపడతాడు; అతనిని అవహేళన చేసినపుడు ఆ కోరికని అణచుకోడానికో, ఎవరికీ తెలియకుండా ఉంచడానికో ప్రయత్నిస్తాడు. తనకి తన గురించీ, వాటి విలువగురించి ఖచ్చితమైన అవగాహన లేకపోవడంతో, ఈ అవహేళన ప్రభావం అతని మీద ఎక్కువగా ఉంటుంది. అతనికి కవిత్వం అంటే గొప్ప ఇష్టం ఉండవచ్చు. బహుశా, ఇంకో కుర్రాడు “కవిత్వం అంతా చెత్త” అని అనొచ్చు. ఆ కుర్రాడు చెప్పిన అభిప్రాయమే లోకం అభిప్రాయంగా ఊహించుకుని, తనకి కవిత్వం పట్ల ఉన్న ఇష్టాన్ని తనకున్న బలహీనతగా భావించడమూ, కవులందరూ తనలా విలక్షణంగా ఉండి ఏదో పిచ్చి రాతలు రాసుకుంటారనీ, తెలివైనవాళ్ళకు అందులో కుతూహలం ఉండదనీ అనుకోవచ్చు. అందులో దౌర్భాగ్యం ఏమిటంటే, తనకి బోధించే ఉపాధ్యాయులకే అటువంటి అభిప్రాయం ఉండవచ్చు. వాళ్లకి కూడా లాటిన్ లోనో, గ్రీకులోనో రాస్తే తప్ప, కవిత్వం చేపట్టవలసిన వ్యాపకం కాదు; ఆ రెండు భాషలయితేనే వాళ్ళు కవిత్వంద్వారా నేర్చుకుంటారు. కాబట్టి కవిత్వం అంటే ఇష్టపడే కుర్రాడు ఈ మూర్ఖపు, ప్రతికూల ప్రపంచంలో తనో విచిత్రమైన వ్యక్తినని అనుకుంటాడు. తన ప్రేమని అదేదో అపరాధంలా ప్రపంచానికి కనిపించకుండా గోప్యంగా ఉంచుకుంటాడు; అదే సమయంలో అదంటే గర్వపడతాడు కూడా, బహుశా అహంకారిగా మారినా మారవచ్చు. లేదా, ప్రపంచాన్ని మరికొంచెం ఎక్కువ అవగాహన చేసుకున్న తర్వాత, తనలాగే చాలామందికి కవిత్వం అంటే ఇష్టమనీ, అందులో తన తోటి విద్యార్థులున్నారనీ ఆశ్చర్యపడినా పడవచ్చు. అతను చిత్రమైన వ్యక్తి కానే కాడు అన్నవిషయం కుర్రాడిగా ఉన్నప్పుడే తెలిసి ఉంటే అతను ఆనందంగా ఉండడమే గాక, చాలామందికి ప్రీతిపాత్రుడయి ఉండేవాడు. తనకి తెలియదు కనుక, కవిత్వం పట్ల తనకున్న ప్రేమ వెర్రిగా, భయంగా మారి, (ఎప్పటికైనా ఆ భయాన్ని ఒదుల్చుకోగలిగితే,) అది ఒదుల్చుకోడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది.

కానీ అతని ఉపాధ్యాయులూ, తల్లిదండ్రులూ కవిత్వం పట్ల అభిమానం ఏ కొద్దిమందికో పరిమితమైన విచిత్ర పోకడకాదనీ, అది ఆత్మకి సంబంధించిన సహజ లక్షణమని తెలియజెప్పాలి; కవిత్వాన్నీ, సత్యాన్నీ, సౌందర్యాన్నీ ప్రేమించడం వల్ల ఆ కుర్రాడు మూర్ఖుడూ కాదు, అసాధారణమైన వాడూ కాదని చెప్పాలి. పిల్లల్లో ఆత్మకి సంబందించిన ఈ ఆకాంక్షలు బలీయంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ ఆశ్చర్యపడడం సహజం. వాళ్ళు అది అనారోగ్యకరమని బావిస్తారు, అది తరచుగా అలాగే పరిణమిస్తుంది; ఎందుకంటే, ఈ కుతూహలం ఉన్నవ్యక్తి తన్నొక ప్రత్యేకవ్యక్తిగా, ప్రపంచమంతా తనకి వ్యతిరేకంగా ఊహించుకుంటాడు. ఈ అనారోగ్యానికి మందు అప్పుడప్పుడు అతని కుతూహలంపై వేసే తుంటరి పరిహాసాలు కాదు; అతనికి కవిత్వం స్వభావాన్నీ, విలువనీ చెప్పి అతనికి అది ప్రత్యేక లక్షణం కాదని గ్రహించేలా చెయ్యడం. మన పాఠశాలల్లోనూ, మన సమాజంలోనూ, చాలవరకు అసంకల్పితంగా జరిగినప్పటికీ, అనూచానంగావస్తూ, ఇప్పటికీ కొనసాగుతున్న తప్పుడు అలవాటు ఒకటి ఉంది: ఆత్మగతమైన కోరికలని విస్మరించడం. దీన్ని మించిన చిత్రం మరొకటి ఉండదు. వాటిపట్ల మనకి అవసరంలేని సిగ్గు, ఒకరకమైన బిడియం ఉన్నాయి. వాటి గురించి ఎప్పుడైనా పొరపాటున మాటాడవలసి వస్తే, అక్కడికి మనం మాటాడుతున్న విషయం అసభ్యకరమైనట్టు, గుసగుసలు పోతూనో, పరిహాసంగానో మాటాడుతుంటాం. మిగతా విషయాల్లాగే వాటి గురించి కూడా ఉన్నదున్నట్టు మాటాడాలి, డబ్బు సంపాదించడం అన్న విషయం గురించి నలుగురికీ ఎంత అభిరుచి ఉంటుందో, ఆత్మగతమైన కోరికలమీద కూడా అంత కుతూహలంగా మాటాడాలి. అది నిజం కూడా. అవి విశ్వవ్యాప్తంగా ఇష్టమైనవే కాదు, మనం గంభీరంగా రోజూ మాటాడుకునే చాలా విషయాలకంటే ఎక్కువ ఆసక్తికరమైనవి. ఆత్మతత్త్వంగూర్చి మన ఈ అక్కరలేని సిగ్గూ బిడియమూ మనకున్న అజ్ఞానానికి ప్రతిఫలితం. ఆత్మ కార్యకలాపాలని అవి అందుకోవడమే ధ్యేయంగా మనిషి పరిశ్రమించాలనీ, అసలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్న ఆత్మ వాటిని వాటికోసం అనుసరించడానికి ప్రయత్నిస్తుందన్న విషయాన్ని మనకు మనం ఎన్నడూ చెప్పుకోము. మనదృష్టిలో ఇవి యుక్తమైన వ్యవహారాలు కావు; కాని అవే నిజమైన వ్యవహారాలూ; ఎంపిక చేసిన ఏ కొద్దిమందికోగాక యావత్ మానవాళీ అనుసరించవలసిన యోగ్యమైన వ్యవహారాలూ అవే; కానీ, దీన్ని అర్థం చేసుకోలేక, ఈ కార్యకలాపాలు అనుసరిస్తున్నప్పుడు మనం ఏదో ప్రత్యేక వ్యక్తులమనో, లేక కాలాన్ని వృధా చేస్తున్నామనో అనుకుంటాము; మన పిల్లలచే అలా ఆలోచించంపజేస్తాము. అందువల్ల చదువుకి ప్రామాణికంగా నిలబడవలసిన వీటిపట్ల, మనలో, కనీసం ధనికవర్గాల్లో, ఇవి ఎందుకూ కొరగానివనే చులకనభావం ఏర్పడిపోయింది. అవసరంలేని లజ్జాహేతువయింది. ప్రత్యేకంగా నైతికవిలువలపట్ల కూడా మనకి అటువంటి చులకన స్వభావమే ఉంది; దానికి కారణం, మనకు తెలియకుండానే, ఆత్మతత్త్వం కేవలం నైతికతకే పరిమితమైనదని మనకున్న దురభిప్రాయం. మనకు నైతిక విలువలు మాత్రమే చాల గంభీరంగా తీసుకునే వ్యక్తి చాలా గంభీరమైన వ్యక్తి అనే దురభిప్రాయం ఉంది. నిజానికి కేవలం నైతిక విలువలు మాత్రమే గంభీరంగా తీసుకునే వ్యక్తి గంభీరత చాలా సంకుచితమైనది. మనం ఆత్మకి సంబంధించిన అన్ని కార్యకలాపాలూ గంభీరంగా తీసుకోవాలి, వాటిని వాటికోసం తప్ప ఏ ఇతర లక్ష్యాలకోసం ప్రయత్నించం గనుక. అసలు వాటితో పోల్చినపుడు ఏ ఇతరవ్యాపకమూ గంభీరమైనది కాదు అని గుర్తించడమే నిజమైన మనోధర్మం. నైతికవిలువలే గంభీరమైనవి అనుకోవడం మనలోనూ, ఇతరుల్లోనూ, గంభీరతని తప్పుగా అన్వయించడం వల్ల వచ్చినది. నిజమైన గంభీరత ఏమిటో తెలిస్తే ఒక్క సారి మన అకారణభయాలూ, మిధ్యాగంభీరత పటాపంచలై మనకు నవ్వు వస్తుంది. కాని, ఆ మాయ పటాపంచలవాలంటే, ముందు మనకు నిజమైన గంభీరత ఉండాలి. అన్ని నిజమైన మనోధర్మాల వెనుకా ఆత్మతత్త్వం ఇమిడి ఉంది. కానీ నైతిక విలువల్ని అతిగా ఉన్నాయని పరిహసించే మిధ్యామనోధర్మం వెనుక, వాటిని అర్థంచేసుకోలేని గందరగోళం మాత్రమే ఉంది. దీనికారణంగానే, మిగతా ఆత్మకార్యకలాపాలనీ పరిహసించడం జరుగుతుంది. ఎక్కడో తప్పు ఉందని తెలిసినా, ఆ తప్పేమిటో తెలియకపోవడం వల్ల, వెనుక ఏ తాత్త్విక చింతనా లేని కారణంగా, అన్ని ఆత్మ కార్యకలాపాలూ గంభీరమైనవే అన్న విషయం గుర్తించము.

సహజంగా, నైతికప్రవర్తన మాత్రమే ఆధ్యాత్మిక కార్యకలాపంగా అందరూ అనుకోవడం వల్ల, మేధోపరమైన అభ్యాసం, కళాత్మకమైన అభ్యాసం, ఆత్మకార్యకలాపాలుగా అనుసరించేవారికి దీనిపై వ్యతిరేకత ఉంటుంది. నీతే సర్వస్వంగా చెప్పే వారిలోని చెడుని వారు వేలెత్తి చూపిస్తారు; దానికి ప్రతిగా వాళ్ళు వీరిలోని మేధోపరమైన అసంబద్ధతలూ, కళాత్మకతలోని దోషాలూ చూపిస్తారు. నైతిక, సత్య సౌందర్యాలు మూడింటిలో ఏ ఒక్క ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని సహజంగానూ, సరియైన రీతిలోనూ అభ్యసించాలన్నా, అనుసరించాలన్నా, ఈ మూడింటి ఉనికినీ ముందు గుర్తించాలి, సాధన చెయ్యడానికి ప్రయత్నించాలి. అంతరాత్మలేని వ్యక్తి కళాకారుడు కాలేడు, సంస్కారం లేని వ్యక్తి ఋషికాలేడు. కళాకారుడికి కళాత్మక అంతఃకరణ ఉండాలి, అందులో ఎప్పుడూ ఎంతోకొంతమేరకి నైతిక అంతఃకరణ ఉంటుంది పవిత్రతలోని సౌందర్యాన్ని దర్శించగలిగేలా. అలాగే, ఋషిలో కూడా ఎంతో కొంతమేరకు సౌందర్యంలోని పవిత్రతని గ్రహించగలిగే కళాత్మక అంతఃకరణ ఉంటుంది. నిజానికి ప్రతి అంతఃకరణకీ మిగతా రెండింటితో తనకున్న సోదరభావం గ్రహించగలశక్తి ఉంటుంది; ఒకటి మిగతా రెండింటికీ దారి తీస్తుంది కూడా.

కానీ అలా కాకుండా, సంకుచితంగా, తాత్త్వికచింతనలేకుండా దేనికదే ఉన్న నాడు, దేనికదే ఏదీ కాకుండా పోతాయి. నైతికవాది మిగతా రెండు ఆత్మ కార్యకలాపాలని గుర్తించకుంటే, అనివార్యంగా ఈ ప్రపంచంలో గాని, ఉత్తరలోకాల్లో గాని సుఖంగా జీవించడానికి నైతికత ఒక్కటే మార్గమని అనుకుంటాడు అతనికి ఈ నైతికతతో ఏమి చెయ్యాలో తెలీక. అలాగే, కేవలం సౌందర్య పిపాసి భోగలాలసుడుగా మారుతాడు; కేవలం మెధావి కుతర్కం చేసే వాడుగానో, పాండిత్య ప్రదర్శించే వాడిగానో మిగిలిపోతాడు. అలా ఏది జరిగినా అది విద్యావిధానంయొక్క వైఫల్యమే. కేవలం ఆత్మతత్వ్వాన్ని స్పష్టంగా, పరిపూర్ణంగా బోధించడం ద్వారా మాత్రమే అటువంటి వైఫల్యాన్ని అరికట్టవచ్చు.

The Structure of the Universe (Vedic) - Viswaroopa - K. Sivananda Murty Preface 2

https://www.facebook.com/vallury.sarma/posts/616984388338978 The Puranas speak of individuals going up and down between these proximate...